అచ్చం చిరంజీవి ఇంద్ర సినిమాలో మాదిరిగా భలే చోరీ
విజయవాడ: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఇంద్ర సినిమాలో మాదిరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోరీ జరిగింది గంగా నదిలో పిండప్రదానం చేయడానికి వచ్చిన ఏవీఎస్ను, ఇంద్ర సినిమాలో 'మీది తెనాలే.. మాది తెనాలే' అంటూ బ్రహ్మానందం బురిడీ కొట్టించి, పిండ ప్రదానం చేసే సమయంలో వాళ్ల దగ్గరున్న నగలు, డబ్బులు కొట్టేసే దృశ్యం గుర్తుండే ఉంటుంది.
ఆ విధమైన సంఘటనే కృష్ణా పుష్కరాల్లో మంగళవారం జరిగింది. ఖమ్మంజిల్లా కొత్తగూడేనికు చెందిన బండారి లింగేశ్వరరావు తమ పితృదేవతలకు పిండప్రదానం చేసేందుకు కృష్ణాఘాట్కు వచ్చారు. అక్కడ విశాఖజిల్లా పెదవాల్తేరుకు చెందిన పురోహితుడు బొంగు ఆదినారాయణను కలిశారు.
కార్యక్రమం జరుగుతున్న సమయంలో లింగేశ్వరరావు చేతికి ఉన్న నవరత్న ఉంగరం, వెండి ఉంగరాన్ని ఆదినారాయణ చూశారు. వాటిని కాజేయాలనే ఆలోచనకు వచ్చాడు. దీంతో పిండప్రధానం చేసేటప్పుడు చేతి వేళ్లకు బంగారు వస్తువులు ఉండకూడదని చెప్పాడు.
అతడి మాటలు విన్న లింగేశ్వరరావు వాటిని తీసి తన బ్యాగ్లో భద్రపరచుకున్నాడు. ఆ తర్వాత పిండాలను ఒంటరిగా వెళ్లి నదిలో కలపమని చెప్పా రు. వాటిని కలిపి అయనకు దక్షిణ చెల్లించి తన బ్యాగులో ఉన్న ఉంగరాలను చూసుకోగా వాటిలో నవరత్నాల ఉంగరం కనిపించకపోయేసరికి ఆదినారాయణను అడిగాడు.
తనకేమీ తెలియదని బుకాయించడంతో లింగేశ్వరరావు అక్కడే ఉన్న డీఎస్పీ పి.సోమశేఖర్ను ఆశ్రయించాడు. ఆయన వచ్చి ఆదినారాయణను గట్టిగా అడగడంతో ఉంగరాన్ని ఇచ్చేశాడు. పురోహితుడిని కృష్ణలంక పోలీసులకు అప్పగించారు.