తెరాస నేత చేతులు కట్టేసి ఇల్లు దోచుకున్నారు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) రంగారెడ్డి జిల్లా బిసి సెల్ అధ్యక్షుడు పొగాకు నర్సింహగౌడ్ ఇంట్లో మంగళవారం అర్ధరాత్రి దొంగలు పడ్డారు. బండరాయితో తలుపులు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. నర్సింహగౌడ్ చేతులు కట్టేసి బీరువాలోని లక్షన్నర నగదు, అతడి భార్య మెడలోని 5 తులాల బంగారు నగలు, విలువైన డాక్యుమెంట్లు గల బ్రీఫ్కేస్ తీసుకుని పారిపోయారు.
వివరాలు ఇలా ఉన్నాయి - పెద్దఅంబర్పేట్ - పసుమాముల రోడ్డులోని రాఘవేంద్రనగర్కాలనీలో నర్సింహగౌడ్ నివాసం ఉంటున్నాడు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటి గంటన్నర సమయంలో సమయంలో పెద్ద శబ్దం రావడంతో కుటుంబసభ్యులంతా లేచి కూర్చున్నారు. రెప్పపాటులో నలుగురు దోపిడీ దొంగలు తలుపులు తీసుకుని ఇంట్లోకి ప్రవేశించారు. మరో ఇద్దరు దొంగలు బయట కాపలాగా ఉన్నారు.
ముఖం కనిపించకుండా మంకీ క్యాప్ ధరించారు. ఒక చేతిలో కట్టెలు, మరో చేతిలో టార్చిలైట్ పట్టుకున్నారు. వచ్చీరాగానే ఇంట్లోని లైట్లను తొలగించారు. తాము నక్సలైట్లమని, బాంబులు వేసి చంపేస్తామని, అరవొద్దంటూ బెదిరించారు. నర్సింహను కిందపడేసి వెంట తెచ్చుకున్న తాళ్లతో చేతులు కట్టేశారు. అనంతరం నర్సింహ భార్య జయ వద్దకు వెళ్లి నగదు, నగలు ఎక్కడ ఉన్నాయో చెప్పాలని బెదిరించారు. భయపడ్డ ఆమె మెడలోని 5 తులాల బంగారు ఆభరణాలను వారికి ఇచ్చేసింది.
తర్వాత దుండగులు జయతో అల్మారా తాళాలు తెరిపించి లక్షన్నర నగదు తీసుకున్నారు. విలువైన డాక్యుమెంట్లున్న బ్రీఫ్కేసును అపహరించుకుపోయారు. బ్రీఫ్కేసులో డాక్యుమెంట్లతో పాటు బ్యాంక్ పాస్బుక్స్, కోర్టు వివాదాలకు సంబంధించిన పత్రాలు, చెక్బుక్లు ఉన్నాయని నర్సింహగౌడ్ తెలిపారు. దుండగులు రాయలసీమ యాసలో మాట్లాడారని బాధితుడు తెలిపారు.
దుండగుల్లో ఒకరు నల్లగా, మరో వ్యక్తి లావుగా ఉన్నాడని, షర్ట్లను నడుముకు కట్టుకున్నారని తెలిపారు. నర్సింహ ఫిర్యాదుతో సంఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు క్లూస్టీమ్ను రప్పించి వేలిముద్రలుసేకరించారు. డాగ్స్క్వాడ్ నర్సింహ ఇంటి నుంచి పెద్దఅంబర్పేట్ సబ్స్టేషన్ పక్కగా పసుమాముల కళానగర్ క్రాస్రోడ్స్ వరకు వెళ్ళాయి.