ఎటిఎం కార్డుల క్లోనింగ్తో చోరీలు: ముంబై టెక్కీ పథకం
హైదరాబాద్: ఏటీఎం కేంద్రాలలో కార్డులను క్లోనింగ్ చేసి నగదు డ్రా చేస్తున్న ముఠాలోని ఇద్దరు సభ్యులు హైదర్అలీ, అశోక్శెట్టిని పంజాగుట్ట పోలీసులు హైదరాబాద్లోని సోమాజిగూడలో అరెస్టు చేశారు. నిందితుల నుంచి బ్లాక్ మెటల్ ప్యానల్ పరికరం, డీసీ బ్యాటరీ, కెమెరా స్వాధీనం చేసుకున్నారు. సోమవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పశ్చిమ మం డలం డీసీపీ వెంకటేశ్వరరావు వివరాలు వెల్లడించారు.
ముంబైలోని సౌత్జైల్ ప్రాంతా నికి చెందిన ఫైజన్ ఫరూక్ ఛత్రీ వాలా సాఫ్ట్వేర్ ఉద్యోగి. ముంబైకి చెందిన హుసేన్ హనీఫ్, వెల్డింగ్ వర్కర్ హైదర్ అలీ సరంగ్, కాల్సెంటర్ ఉద్యోగి అవిత్ అశోక్శెట్టి, ఆశిష్ మవ్వాడి, నాజిర్ ఆలం, అఖిల్ ఆదిల్ బౌరణ్య, జాఫర్ హఫీజ్ఖాన్తో కలిసి ముఠా ఏర్పాటు చేశాడు. ఫరూక్ ఛత్రీ నైజీరియా దేశస్థుల నుంచి మాదకద్రవ్యాలను కొనుగోలు చేసేవాడు. వీటిని ముఠా సభ్యులకిచ్చి మత్తులో ముంచేవాడు. తర్వాత వారిని డబ్బులు అడిగేవాడు. వారి దగ్గర డబ్బుల్లేని నిస్సహాయతను ఆసరా చేసుకుని ఏటీఎంల క్లోనింగ్లలో భాగస్వామ్యం చేసేవాడు.
ఏటీఎం సెంటర్ల రూఫ్లో స్ఫై కెమెరా అమర్చుతారు. ఖాతాదారుడు కార్డు పెట్టే ఏటీఎం స్టాట్లో మ్యాగ్నటిక్ కార్డ్ రీడర్ అమరుస్తారు. ఈ కార్డు రీడర్ ద్వారా ఏటీఎం కార్డు క్లోనింగ్ను తయారుచేస్తారు. ఏటీఎంలో మన సీక్రెట్ పిన్ నంబర్ను పైన బిగించిన స్ఫై కెమెరా రికార్డు చేస్తుంది. దీంతో ఖాతాదారుడి కార్డు, పిన్ నెంబర్ దొంగలకు తెలిసిపోతుంది. ఇలా జంటనగరాల్లో పలు ఏటీఎంలలో వీరు నగదు అపహరించారు.
ఫరూక్ ఛత్రీవాలా తన అనుచరులతో ఫిబ్రవరి మొదటివారంలో నగరానికి వచ్చాడు. ఫలక్నుమా సమీపంలోని జహనుమాకు చెందిన జఫార్ఖాన్ ఇంట్లో ఆశ్రయం పొందాడు. బేగంపేటలోని ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, స్టేట్బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలో క్లోనింగ్కు పాల్పడ్డారు. క్లోనింగ్ కార్డులతో గోవాతో పాటు దక్షిణ భారతదేశంలోని పలు పట్ట ణాల్లో నగదు డ్రా చేశారు.
వీరిపై పంజాగుట్ట, ఎస్ఆర్నగర్, బేగంపేట, మహంకాళి, మారేడ్పల్లి, తిరుమలగిరి, సంతోష్నగర్, బహదూర్పుర, నారాయణగూడ, ఆసిఫ్నగర్, బంజారాహిల్స్, హైదరాబాద్ క్రైం పోలీస్స్టేషన్, సైబరాబాద్ క్రైం పోలీస్స్టేషన్ల పరిధిలో 32 కేసు లు నమోదయ్యాయి.
నిందితులు మూడు దఫాలుగా గోవా, హైదరాబాద్లో ఏటీఎంలను క్లోనింగ్ చేశారు. మొదటిసారిగా 2013లో 60 నుంచి 70 ఏటీఎంలను క్లోనింగ్ చేసి రూ.12 లక్షలు డ్రా చేశారు. రెండోసారి ఈ ఏడాది జనవరిలో 50 నుంచి 60 ఏటీఎంలు క్లోనింగ్ చేసి రూ.7 లక్షలు డ్రా చేశారు. మార్చిలో 80 నుంచి 100 ఏటీఎంలను క్లోనింగ్ చేసి రూ.9 నుంచి రూ.10 లక్షలు డ్రా చేశారు. ఏటీఎం సెంటర్లలో నగదు డ్రా చేసే సమయంలో ఖాతాదారులు జాగ్రత్తగా ఉండాలని డీసీపీ సూచించారు.