పవర్ కట్ చేసి నాపై దాడి చేయించే ప్రయత్నం, ఇక మాటల్లేవు.. చేతలే: బాబుకు పవన్ వార్నింగ్
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా నరస్నపేటలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోరాట యాత్ర ఆదివారం కొనసాగుతుంది. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి పవన్ నిరసన కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేనాని మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సామాన్యుడిగా తాను రోడ్డు పైకి వచ్చానని చెప్పారు. ఉత్తరాంధ్రలో ఎక్కడకు వెళ్లినా కన్నీటి గాథలే కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
జనసేనకే మద్దతు: దీక్షలో బీజేపీ ఎమ్మెల్యే భార్య, బాబు పట్టించుకోవట్లేదు, మీరైనా: మోడీకి పవన్
తెలుగుదేశం పార్టీ ఉమ్మడిగా తిని, ఒంటరిగా బలవాలనుకుంటోందని అధికార పార్టీపై నిప్పులు చెరిగారు. టిడిపి ఇప్పుడు ఏపీలో అధికారంలో ఉందంటే దానికి కారణం జనసేన సైనికులే కారణమని చెప్పారు. వంశధార ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం ఇవ్వడం లేదని ఆరోపించారు. తాను అందరి రాజకీయ నాయకుల వంటి వ్యక్తిని కాదని ఆయన చెప్పారు.
ఇక మాటల్లేవు, చేతలే
అందరిలా తాను రాజకీయాలు చేయడానికి రాలేదని పవన్ అన్నారు. అలా అనుకుంటే తాను 2014లోనే మంత్రి పదవులు అనుభవించేవాడినని చెప్పారు. తాను అడిగితే అప్పుడే మంత్రి పదవులు ఇచ్చేవారన్నారు. బీజేపీ ఏపీకి ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వదని దుయ్యబట్టారు. ప్రత్యేక హోదా, రాష్ట్ర సమస్యలపై ఇక మాటలు లేవని, ఇక చేతలేనని ప్రభుత్వాలకు హెచ్చరికలు జారీ చేశారు.
వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం
వారసత్వ పాలనకు జనసేన పార్టీ వ్యతిరేకం అని పవన్ కళ్యాణ్ అన్నారు. వారసత్వ రాజకీయాల కారణంగానే శ్రీకాకుళం జిల్లా ఇంకా వెనుకబడి ఉందని చెప్పారు. మభ్యపెట్టే రాజకీయాలకు ధీటుగా 2019లో అధికారం ఏర్పాటు చేయాలన్నారు. అధికారం ఏ ఒక్కడి సొత్తు కాదని చెప్పారు. జనసేన వల్ల గెలిచి ఇప్పుడు తమనే దెబ్బతీయాలని చూస్తోందని అభిప్రాయపడ్డారు.
కరెంట్ కట్ చేసి దాడి చేయించే ప్రయత్నం
తనపై దాడులకు కూడా ప్రయత్నించారని పవన్ కళ్యాణ్ అన్నారు. ఇటీవల తాను ఉన్న కళ్యాణ మండపంలో కరెంట్ కట్ చేయించి దాడులు చేయించేందుకు ప్రయత్నాలు చేశారని ఆమండిపడ్డారు. ఇటీవల ఓ కళ్యాణ మండపంలో పవన్ విడిది చేయగా అర్ధరాత్రి కొందరు వచ్చి హల్చల్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో పవన్ సెక్యూరిటీకి గాయాలయ్యాయి. పవన్ ఆదివారం మధ్యాహ్నం ఎచ్చెర్ల రిసార్టు నుంచి నరసన్నపేట చేరుకున్నారు. ఇక్కడ సమావేశంలో మాట్లాడారు. పాతపట్నంలోను, ఆ తర్వాత ఆముదాలవలసలో సమావేశాలు ఉంటాయి. 28వ తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు పాలకొండ చేరుకుంటారు. సాయంత్రం నాలుగు గంటలకు రాజాం, ఆరు గంటలకు రణస్థలం చేరుకుంటారు.
పుస్తకం చదువుతూ, అభివాదం చేస్తూ
కాగా, పవన్ కళ్యాణ్ ఉధ్ధానం ఇష్యూపై శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం సాయంత్రం వరకు దీక్ష చేసిన విషయం తెలిసిందే. రిసార్టులో దీక్ష సమయంలో పవన్ పుస్తకాలు చదివారు. ప్రజల మధ్యకు వచ్చినప్పుడు అభిమానులు, మద్దతిచ్చేందుకు వచ్చిన వారితో బిజీగా గడిపారు. అందరికీ చేయి ఊపుతూ అభివాదం చేశారు. 'శ్రీకాకుళం నక్సలైట్ ఉద్యమం' అనే పుస్తకం ఆయన చేతిలో ఉంది. అభిమానులు, కార్యకర్తలు పవన్ కాబోయే సీఎం అంటూ నినాదాలు చేశారు.