వైసీపీని వీడనున్న మరో నలుగురు ఎమ్మెల్యేలు ?
ఏపీలో వైసీపీ అధిష్టానం చేపట్టిన ఇన్ ఛార్జ్ ల మార్పులు చేర్పులు సిట్టింగ్ ఎమ్మెల్యేలలకు చుక్కలు చూపిస్తున్నాయి. ముఖ్యంగా ఎంతో కాలంగా వరుసగా గెలుస్తూ వస్తున్న, లేదా గతంలో మంత్రులుగా కూడా పనిచేసిన అనుభవం ఉన్న వారిని సైతం పక్కనబెట్టేస్తుండటంతో వారిలో కొందరు తమ దారి చూసుకునేందుకు సిద్ధమైపోతున్నారు. ఇప్పటికే వైసీపీ అధిష్టానం మూడో జాబితా కూడా విడుదల చేసేయడంతో ఇందులోనూ టికెట్లు దక్కని నలుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు.
వైసీపీ అధిష్టానం చేపట్టిన ఇన్ ఛార్జ్ ల మార్పుల్లో పలువురు ఎమ్మెల్యేలకు టికెట్ లేదని తేలిపోయింది. వీరిలో కృష్ణాజిల్లాకు చెందిన మాజీ మంత్రి కొలుసు పార్ధసారధి, ఎన్టీఆర్ జిల్లాకు చెందిన తిరువూరు ఎమ్మెల్యే రక్షణనిధి, కాకినాడ జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్, పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు వంటి వారు ఉన్నారు. ఈ నలుగురు ఎమ్మెల్యేలు ఇప్పటికే భవిష్యత్ కార్యాచరణపై దృష్టిపెట్టారు. త్వరలోనే ఈ నలుగురు వైసీపీని వీడి టీడీపీ లేదా జనసేనలో చేరబోతున్నారు.

పెనమలూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కొలుసు పార్దసారధికి టికెట్ లేదని తేలిపోవడంతో ఆయన టీడీపీతో చర్చల్లో ఉన్నారు. ఆయనకు నూజివీడు సీటు కేటాయించే అవకాశం ఉంది. అలాగే తిరువూరు ఎమ్మెల్యే రక్షణ నిధికి పామర్రు టీడీపీ టికెట్ కేటాయించే అవకాశం ఉంది. పత్తిపాడు ఎమ్మెల్యే పర్వతపూర్ణచంద్రప్రసాద్ కూడా టీడీపీ,జనసేనతో చర్చలు జరుపుతున్నారు. ఇవాళ్టి నుంచి ఆయన ప్రజా దీవెన పేరుతో ప్రజల్లోకి వెళ్లి బల ప్రదర్శన చేసేందుకు సిద్ధమయ్యారు.
ఇక పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు కూడా ఇవాళ పుట్టినరోజు పేరుతో అనుచరులతో భారీ సమావేశం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమ స్వాగత ఫ్లెక్సీల్లో ఎక్కడా వైసీపీ జెండా, జగన్ ఫొటో లేదు. దీంతో ఆయన పార్టీ మారడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే జనసేనతో టచ్ లో ఉన్న ఆయన.. తనకు కానీ, కుమార్తె కు కానీ టికెట్ కోరుతున్నారు. అయితే మిగతా నియోజకవర్గాల సమీకరణాల ఆధారంగా ఈ టికెట్ ఖరారు కానుంది. ఇలా నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీని వీడబోతున్నారు.












Click it and Unblock the Notifications