Rajahmundry Bridge : రాజమండ్రి రోడ్ కం రైల్ బ్రిడ్జ్ పై వెళ్తున్నారా ? ఇది మీ కోసమే.. !
ఏపీలో చారిత్రక నేపథ్యం ఉన్న అతి కొద్ది భారీ వంతెనల్లో రాజమండ్రి రోడ్డు కమ్ రైలు వంతెన కూడా ఒకటి. దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ బహుళ ప్రయోజన వంతెన మీదుగా వాహనాలు రాకపోకలు సాగిస్తుండగా.. కింద రైళ్ల రాకపోకలు కొనసాగుతున్నాయి. చక్కగా ఒంపు తిరిగి ఉండే ఈ వంతెన గోదావరి జిల్లాలకు మణిహారంలా ఉంది. రాజమండ్రి-కొవ్వూరు మధ్య దాదాపు రెండున్నర కిలోమీటర్ల పొడవున నిర్మించిన ఈ వంతెన ఇన్నేళ్లుగా గోదావరి జిల్లాల ప్రజలతో పాటు ఈ మార్గంలో రాకపోకలు సాగించే వారు, పర్యాటకులకు కూడా ఎంతో ఉపయోగపడింది.
కానీ కాలం మారుతోంది. ఈ చారిత్రక వంతెనపై కూడా గతంలో పోలిస్తే భారీగా రాకపోకలు పెరిగాయి. అలాగే భారీ వాహనాల్ని కూడా తట్టుకునే సామర్ధ్యం ఉండటంతో ఇరు జిల్లాల నుంచి భారీ వాహనాలు దీనిపై రాకపోకలు సాగిస్తున్నాయి. కానీ ఇదే ఇప్పుడు శాపంగా మారింది. భారీ వాహనాల రాకపోకలు నానాటికీ పెరుగుతుండటంతో వంతెన తరచూ దెబ్బతింటోంది. ఎన్ని మరమ్మత్తులు చేసినా తిరిగి రిపేర్లు తప్పడం లేదు. దీంతో ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్దితి.

ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజమండ్రి రోడ్ కమ్ రైలు బ్రిడ్జి పై ఇక నుంచి భారీ వాహనాల రాకపోకలకు అనుమతిని నిషేధించారు. ఇప్పటివరకూ ఈ వంతెనపై నుంచి వెళ్తున్న భారీ వాహనాలను గామన్ బ్రిడ్జిపైకి మళ్లిస్తున్నారు. దీంతో ఇప్పుడు కేవలం కార్లు, ద్విచక్ర వాహనాలు, ఆటోలు మాత్రమే దీనిపై రాకపోకలు సాగించే అవకాశం ఉంది. అసలే వర్షాకాలం కావడంతో భారీ వాహనాల రాకపోకల వల్ల వంతెనపై ప్రమాదాలు జరగకుండా ముందుజాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

అయితే ఆదివారం సడన్ గా తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా నిత్యం రోడ్ కమ్ రైలు బ్రిడ్జిపై రాకపోకలు సాగించే భారీ వాహనాలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. అలాగే భారీ వాహనాలకు నో ఎంట్రీ ఉత్తర్వులు ఎప్పటివరకూ అమల్లో ఉంటాయో కూడా చెప్పలేదు. దీంతో రోడ్లు భవనాల శాఖ అధికారుల సూచన మేరకుప శాశ్వతంగా వీటిపై భారీ వాహనాల్ని నిలిపేస్తారా లేక వర్షాలు తగ్గాక తిరిగి అనుమతిస్తారా అన్నది తేలాల్సి ఉంది. అప్పటివరకూ చిన్న వాహనాల రాకపోకలకు మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications