సైకో ఫ్యాన్స్, వాడెవ్వడని ఊగిపోయిన జెసి: కిరణ్తో భేటీ
హైదరాబాద్: తనపై చర్యలు తీసుకోవాలని పిసిసి అధ్యక్షులు ఏఐసిసికి లేఖ రాయడం సంతోషకరమని అనంతపురం జిల్లా సీనియర్ కాంగ్రెసు పార్టీ శాసన సభ్యులు, మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి బుధవారం అన్నారు. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పైన తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు.
తాను వాస్తవాలను మాట్లాడుతుంటే కొందరు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. వారంతా సైకో ఫ్యాన్స్ అని విమర్శలు గుప్పించారు. ఏఐసిసి అధ్యక్షురాలు, యూపిఏ చైర్ పర్సన్ సోనియా గాంధీని విమర్శిస్తే సిఎల్పీ కార్యాలయంలోకి రానివ్వక పోయేందుకు వాడెవ్వడంటూ ఊగిపోయారు.
కిరణ్తో భేటీ
ఇటీవల అధిష్టానాన్ని ధిక్కరిస్తూ మాట్లాడుతున్న మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి మధ్యాహ్నం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో భేటీ అయ్యారు. భేటీకి ఎలాంటి ప్రత్యేకత లేదని చెప్పారు.
జెసి తాడోపేడే
జెసి దివాకర్ రెడ్డి తీరు చూస్తుంటే కాంగ్రెసు పార్టీ అధిష్టానంతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నట్లుగా కనిపిస్తోంది. కాంగ్రెసు పార్టీ తెలంగాణకు అనుకూలంగా తీసుకుంటుందని తెలిసినప్పటి నుండి ఆయన రాయల తెలంగాణ కోసం ప్రయత్నాలు చేశారు. రాయల తెలంగాణ ప్రతిపాదన ఇటీవల వినిపించడంతో ఆయన ఆనందం వ్యక్తం చేశారు.
సోనియా గాంధీపై ప్రశంసలు గుప్పించారు. అయితే చివరకు కేంద్ర మంత్రివర్గం కేవలం పది జిల్లాల తెలంగాణకే మొగ్గు చూపడం జెసి ఆగ్రహానికి కారణమైంది. అప్పటి నుండి ఆయన అధిష్టానంపై మండిపడుతున్నారు. రెండు రోజుల క్రితం సోనియాపై ఘాటైన వ్యాఖ్యలు చేయడంతో బొత్స ఏఐసిసికి చర్యలు తీసుకోవాలని లేఖ రాశారు.