గ్రామ సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థలో తప్పు జరిగితే.. తోలు తీసేలా: ఐఎఎస్ అధికారి పర్యవేక్షణలో!
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బ్రెయిన్ ఛైల్డ్ పథకాలు.. వలంటీర్లు, గ్రామ/వార్డు స్థాయి సచివాలయాలు. రాష్ట్ర చరిత్రలో ఇంతకుముందు ఎప్పుడూ లేనివిధంగా ఈ రెండు వ్యవస్థలను సృష్టించారు. జిల్లాస్థాయి పరిపాలనా కార్యకలాపాలను గ్రామస్థాయికి తీసుకెళ్లారు. ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలు, పథకాలను ప్రజలకు మరింత చేరువ చేశారు ఈ రెండు వ్యవస్థల వల్ల. దీనివల్ల రెండున్నర లక్షలమంది నిరుద్యోగులకు ఉపాధిని సైతం కల్పించినట్టయింది.

కట్టు తప్పుతున్నాయనే ఆరోపణలు
ఇప్పుడు అలాంటి వ్యవస్థలు కట్టు తప్పుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు గ్రామవలంటీర్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే వార్తలు ఈ మధ్యకాలంలో అధికంగా వస్తున్నాయి. వాటిని దృష్టిలో ఉంచుకుని వైఎస్ జగన్ మరో కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. వాటిని పర్యవేక్షించడానికి ఐఎఎస్ స్థాయి అధికారిని నియమించడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనికోసం ఓ ప్రత్యేకంగా జిల్లాస్థాయిలో జాయింట్ కలెక్టర్కు ఈ పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించబోతున్నారు.

పనిభారం అధికమైందనే అభిప్రాయాలు
గ్రామ సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ అందుబాటులోకి వచ్చిన తరువాత జిల్లా అధికార యంత్రాంగంపై పనిభారం అధికమైందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఒక్కో జిల్లాలో వేల సంఖ్యలో ఉండే వలంటీర్లను పర్యవేక్షించాల్సి రావడం వల్ల మిగిలిన అంశాలపై దృష్టి సారించలేకపోతున్నాయనే వాదన వినిపిస్తుండేది. ఆయా విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం.. జాయింట్ కలెక్టర్ల సంఖ్యను పెంచాలని నిర్ణయించింది.

ఒక్కో జిల్లాకు ఇద్దరు జాయింట్ కలెక్టర్
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో జాయింట్ కలెక్టర్ల సంఖ్యను పెంచనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం ఒక్కో జిల్లాకు ఇద్దరు జాయింట్ కలెక్టర్లు పనిచేస్తున్నారు. ఈ సంఖ్యను మూడుకు పెంచబోతోంది ప్రభుత్వం. కొత్తగా మరో జాయింట్ కలెక్టర్ పోస్టును సృష్టించనుంది. గ్రామ/వార్డు సచివాలయాల పరిపాలన, వలంటీర్ల వ్యవస్థను పర్యవేక్షించడానికి ఇకపై ఒక్కో జిల్లాలో ముగ్గురు జాయింట్ కలెక్టర్లు పని చేసేలా చర్యలను తీసుకోనుంది.

తప్పు జరిగితే..
గ్రామ సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థలో లోటుపాట్లు సరిచేయడానికి, తప్పు జరిగితే.. వాటికి కారణమైన వారిపై కఠిన చర్యలను తీసుకోవడానికీ ప్రత్యేకంగా జాయింట్ కలెక్టర్ స్థాయి అధికారి పర్యవేక్షించేలా ఏర్పాట్లను చేస్తోంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలోనే వెలువడబోతున్నాయి. వలంటీర్లు, గ్రామ/వార్డు సచివాలయాల ఉద్యోగుల్లో జవాబుదారీతనం తీసుకురావడం, అవినీతి రహితంగా పరి పాలన సాగించడం, సంక్షేమ పథకాల అమలులో నెలకొన్న పొరపాట్లను సరిదిద్దడం, మరింత వేగాన్ని తీసుకుని రావడమే ప్రధాన లక్ష్యంగా జాయింట్ కలెక్టర్ల పర్యవేక్షణలోకి వెళ్లనున్నాయి ఈ రెండు వ్యవస్థలు.