టీడీపీకి ఇది మరో పరాభవం: జీవీఎల్; ఆ ఎన్నికల్లో వైసీపీ నాటకం: అచ్చెన్న
న్యూఢిల్లీ: రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్గా హరివంశ్ ఎన్నిక కావడంతో తెలుగుదేశం పార్టీకి మరోసారి పరాభవం జరిగిందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు విమర్శించారు.
Recommended Video
గురువారం రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవికి ఎన్నిక జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలో ఎన్డీఏ అభ్యర్థిగా బరిలోకి దిగిన జేడీయూ నేత ఎంపీ హరివంశ్ నారాయణ్ సింగ్ ఘన విజయం సాధించారు. దీనిపై స్పందించిన జీవీఎల్ మాట్లాడుతూ కాంగ్రెస్తో కలిసిన టీడీపీకి ఇది ఘోర పరాజయంగా అభివర్ణించారు. కాంగ్రెస్ పార్టీలాగే తెలుగుదేశం పార్టీ కూడా అవినీతిలో కూరుకుపోయిందని దుయ్యబట్టారు.
రాష్ట్రంలో జరుగుతున్న స్కాములపై టీడీపీ సమాధానం చెప్పాలని ఎంపి జీవీఎల్ డిమాండ్ చేశారు. త్వరలోనే టీడీపీని ప్రజల ముందు దోషిగా నిలబెడతామని చెప్పారు. కాంగ్రెస్ చెంతన చేరిన టీడీపీకి ప్రజలే బుద్ధి చెబుతారని జీవీఎల్ జోస్యం చెప్పారు.
ఇదిలావుండగా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలో వైసీపీ నాటకమాడిందంటూ ఆ పార్టీ అధ్యక్షుడు జగన్పై మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ప్రత్యేక హోదా ఇవ్వన్నందుకు బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేస్తామని ప్రకటించిన వైసిపి...చివరకు ఓటింగ్లో పాల్గొనకపోవడాన్ని ప్రజలు అర్ధం చేసుకుంటున్నారని అచ్చెన్నాయుడు అన్నారు.
దీంతో బీజేపీతో వైసీపీ లాలూచీ రాజకీయాలు మరోసారి బయటపడ్డాయని అచ్చెన్నాయుడు దుయ్యబట్టారు. పీఏసీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటు వేశారో జగన్, విజయసాయిరెడ్డి చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎందుకు ఓటేశారో కూడా చెప్పాలని మంత్రి అచ్చెన్నాయుడు వైసిపి అధినేత జగన్ ను నిలదీశారు.