ఇదే నా మాట..! నా మాటే శాసనం..!! అంటున్న లోకేష్..
ఏపి తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు తనయుడు, మంత్రి లోకేష్ వ్యవహారం శ్రుతిమించుతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. నిన్నటి వరకు అన్నిశాఖల్లో జోక్యం చేసుకుంటున్నాడనే విమర్శలు ఎదుర్కొన్న లోకేష్., తాజాగా సంప్రదాయలను పక్కన పెట్టి రాబోవు ఎన్నికల అభ్యర్థులను కూడా ఏకపక్షంగా ప్రకటించే స్థాయికి ఎదిగారని నేతలు చర్చించుకుంటున్నారు. పోలిట్ బ్యూరో సమావేశం నిర్వహించి సభ్యుల అభిప్రాయం తెలుసుకోకపోవడంతో పాటు., పార్టీ అంతర్గత వ్యవహారాల్లో లోకేష్ కలుగజేసుకుంటున్నాడని విమర్శలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా కర్నూలు వేదికగా తనకు అనుకూలంగా ఉండే నాయకత్వాన్ని లోకేష్ సిద్దం చేసుకుంటున్నారనే చర్చలు కూడా మొదలయ్యాయి.
Recommended Video
ఆతిథ్య, పర్యాటక రంగాల్లో అద్భుత అవకాశాలు: ఇండియాలో 4 కోట్ల ఉద్యోగాలు
ఏపి రాజకీయాల్లో లోకేష్ చురుకైన పాత్ర..
తెలుగుదేశం పార్టీలో లోకేష్ మాటే ఫైనల్ అన్న పరిస్థితి నెలకొంది. చంద్రబాబు కూడా పార్టీ సీనియర్ నేతలు తన వద్ద ఏదైనా అంశాలను ప్రస్తావిస్తే లోకేష్ కు ఓ మాట చెప్పండని వ్యాఖ్యానిస్తున్నట్లు ఓ సీనియర్ నేత తెలిపారు. అయితే మొన్న కర్నూలులో లోకేష్ చేసిన అభ్యర్ధుల ప్రకటన పార్టీ నేతలకు తప్పుడు సంకేతాలు పంపుతుందని టీడీపీ నేతలే అంగీకరిస్తున్నారు. అయితే పార్టీ నేతల అభిప్రాయాలు ఎలా ఉన్నా..ఇక టిక్కెట్లు కావాలని కోరుకునే వారంతా చంద్రబాబును వదిలేసి..లోకేష్ చుట్టూ చేరటం ఖాయం అని చెబుతున్నారు. ఇప్పటికే అతి పెద్ద ‘పవర్ సెంటర్'గా మారిన లోకేష్..రాబోయే రోజుల్లో మరింత ‘కేంద్రీకృత' వ్యవస్థను ఏర్పాటు చేసుకోనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
కర్నూలు లో అభ్యర్థులను ప్రకటించి ఔరా అనిపించుకున్న లోకేష్..
లోకేష్ కర్నూలు పర్యటన తెలుగుదేశం పార్టీకి కష్టాలు తెచ్చిపెట్టేదిగా కనిపిస్తోంది. 2019 ఎన్నికలకు సంబంధించి తొలి అభ్యర్ధులను తానే ప్రకటించి వివాదానాకి తెరలేపారు. కర్నూలులో పర్యటించిన మంత్రి లోకేష్ అక్కడే ఎంపీ బుట్టా రేణుక, ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డిని గెలిపించాలని పిలుపునివ్వటం ద్వారా తానే అభ్యర్ధులను ప్రకటించేశారు. దీని ద్వారా పార్టీలో పొలిట్ బ్యూరో నామమాత్రమని, ఏపీ పార్టీ అధ్యక్షుడు కళా వెంకట్రావు నామ్ కే వాస్తే అని నిరూపించారు. అయితే గతంలో చంద్రబాబు కూడా తన ఇష్టానుసారమే టిక్కెట్లు ఖరారు చేసేవారనే అపోహకు లోకేష్ మరింత బలాన్ని చేకూర్చినట్టైంది. అభ్యర్థుల విషయంలో కనీసం పొలిట్ బ్యూరోలో నిర్ణయం తీసుకోకుండా, సంప్రదాయాలకు విరుద్దంగా మంత్రి నారా లోకేష్ వ్యవహరించారనే విమర్శలు తెరపైకివస్తున్నాయి.
సంప్రదాయాలకు విరుద్దంగా లోకేష్ డాషింగ్ నిర్ణయం..
ప్రత్యక్షంగా 2019 ఎన్నికలకు సంబంధించి తొలి టిక్కెట్లను ఎవరి అనుమతితో లోకేష్ ప్రకటించారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మామూలుగా చంద్రబాబు సహజశైలి ప్రకారం తాను పోటీచేసే కుప్పం నియోజకవర్గం పేరును కూడా చివరి జాబితాలోనే చేర్చేడం ఆనవాయితీ. టిక్కెట్ల కేటాయింపు అంతా పార్టీలో సీనియర్ల ఏకాభిప్రాయంతో జరుగుతాయని ఆనవాయితీ ఉంది. అందుకోసం సొంత పార్టీ నేతల సహకారం చంద్రబాబుకు పూర్తి స్థాయిలో ఉండేది. చంద్ర బాబు నిర్ణయానికి మెజారిటీ నాయకులు ఆమోదముద్ర వేసిన తర్వాతనే ఏ అంశం ఐనా బయటకు వస్తుందనే అభిప్రాయం కూడా ఉంది. కాని లోకేష్ బాబు టీడిపి సంప్రదాయాలకు విరుద్దంగా వ్యవహరించారని పార్టీలో చర్చ జరుగుతోంది.
లోకేష్ తన సొంత కోటరీకి బీజం వేస్తున్నాడనే విమర్శలు వాస్తవమేనా..?
సీనియర్లు అన్న వారిని పక్కన పెట్టి తన మాట వినేవారికే లోకేష్ వచ్చే ఎన్నికల్లో ప్రాధాన్యత ఇఛ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గతంలో మంత్రులకే అపాయింట్ మెంట్ ఇవ్వకుండా వేచిచూసేలా చేసిన లోకేష్.. ఇక ఇప్పుడు టిక్కెట్లు ఖరారు చేసే పరిస్థితికి వచ్చారంటే తెలుగుదేశం పార్టీలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయోననే సందేహాలను పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు ఏపి నేతలు. మొత్తానికి ముఖ్యమంత్రి విదేశంలో ఉండగా లోకేష్ కర్నూలు పర్యటన పలు రాజకీయ మార్పులకు నాంది పలుకుతోందనే చర్చ ఊపందుకుంది.