కొనసాగుతాయి: అవతరణ వేడుకలపై లగడపాటి ధీమా
విజయవాడ/హైదరాబాద్: రాష్ట్ర అవతరణ వేడుకలు ఇక ముందు కూడా కొనసాగుతాయని విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ శుక్రవారం విజయవాడలో అన్నారు. తెలుగు తల్లిని ముక్కలు చేయాలని కొందరు చూస్తున్నారని ధ్వజమెత్తారు. తాను ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొంటానని చెప్పారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటే తాము 33 స్థానాల్లో ఎంపీ సీట్లను గెలుస్తామన్నారు.
కొంతమంది స్వార్థం కోసమే తెలుగుతల్లిని ముక్కలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రాంతాల వారీగా మళ్లీ అఖిల పక్ష సమావేశం జరుగుతుందన్నారు. అసెంబ్లీకి తెలంగాణపై తీర్మానం వస్తుందని లగడపాటి ఆశాభావం వ్యక్తం చేశారు. విభజనను అడ్డుకునేందుకు చివరి వరకు పోరాటం చేస్తామన్నారు. తనకు విభజన ఆపే శక్తి లేదని గతంలో జగన్ చెప్పారన్నారు. సమైక్యాంధ్ర కోసం కిరణ్ గట్టిగా కృషి చేస్తున్నారన్నారు.

సందిగ్ధతకు తెరపడాలి: యనమల
విభజనపై సందిగ్ధతకు తెరపడాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. ఎన్టీఆర్ భవన్లో అవతరణ వేడుకలు జరిగాయి. యనమల పార్టీ జెండాను ఎగురవేశారు.
ఈ సందర్భంగా మాట్లాడారు. కలిసి ఉండటం వల్లనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమన్నారు. విభజన తీరు మనస్థాపం కలిగిస్తోందన్నారు. చిన్న రాష్ట్రాల వల్ల అభివృద్ధి కుంటుపడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సందిగ్ధతకు తెరపడాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యాలయంలో జగన్ జాతీయ జెండాను ఎగురవేశారు.












Click it and Unblock the Notifications