లాస్ట్, బంతి కేంద్రం కోర్టులో: జైపాల్, బాబుకు కౌంటర్
న్యూఢిల్లీ: ఇది చివరి రోజు అని, తమకైనా, వారికైనా ఇదే ఆఖరి ప్రయత్నమని, ఆ తర్వాత బంతి ప్రభుత్వం కోర్టులో ఉంటుందని కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి ఆదివారం అన్నారు. విభజన నిర్ణయం నేపథ్యంలో పదకొండు అంశాల పైన మంత్రుల బృందానికి (జివోఎం) ఇవ్వాల్సిన నివేదికను రూపొందించేందుకు తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు జైపాల్ నివాసంలో సమావేశమయ్యారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.
సమావేశంలో అన్ని అంశాల పన తాము చర్చించి ఓ నోట్ తయారు చేశామన్నారు. అందరి నేతల అభిప్రాయాలతో తాము నివేదిక తయారు చేసినట్లు చెప్పారు. తెలంగాణ కాంగ్రెసు పక్షాన కేంద్రమంత్రులు జివోఎంకు నివేదికను సోమవారం ఇస్తారన్నారు. ఏది సాధ్యం, ఏది అసాధ్యం అనే వాటిని చర్చించి తాము నివేదిక తయారు చేశామన్నారు.

సీమాంధ్ర ప్రజలకు అన్యాయం చేసే యోచన తమకు లేదని, అలాంటి అంశం నోట్లో లేదన్నారు. పదకొండు అంశాలపై నివేదికను రూపొందించామన్నారు. తమకైనా, సీమాంధ్ర నేతలకైనా ఇదే ఆఖరి రోజు అని, ఆ తర్వాత బంతి పార్లమెంటు, ప్రభుత్వం కోర్టులోకి వెళ్తుందని జైపాల్ రెడ్డి అన్నారు.
పార్లమెంటులో బిల్లు పాస్ అయ్యే వరకు తాను జాతీయ పార్టీల పైన వ్యాఖ్యలు చేయనని చెప్పారు. తమకు అన్ని పార్టీలు, అందరి సహకారం కావాలన్నారు. న్యాయాన్యాయాలు, సాధ్యాసాధ్యాలు పరిశీలించే నోట్ తయారు చేశామన్నారు. తెలంగాణ ప్రజలకు సీమాంధ్రులకు అన్యాయం చేయలేదన్నారు. సీమాంధ్ర నేతలు అనవసర రాద్దాంతం చేస్తున్నారన్నారు. సీమాంధ్ర ప్రజలకు కాంగ్రెసు అన్యాయం చేయదన్నారు.
చంద్రబాబుకు కౌంటర్
తన సమన్యాయం ప్రశ్నకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి నుండి సరైన సమాధానం రాలేదని అభిప్రాయపడ్డారు. తాను సమన్యాయానికి అర్థం అడిగితే ఆయన సమాధానం ఇవ్వలేకపోయారన్నారు. అది పలాయన వాదమన్నారు. తొమ్మిదేళ్లు సిఎంగా, పదేళ్లు ప్రతిపక్ష నేతగా పని చేసిన వ్యక్తి ఏం చెప్పక పోవడం ఎలా అన్నారు. సమన్యాయం ఎలాగే తాము రేపు ఇచ్చే డాక్యుమెంట్లలో కనిపిస్తుందన్నారు. చంద్రబాబు అదే సమన్యాయం కోసం ఎందుకు జివోఎంను కలవలేదన్నారు.












Click it and Unblock the Notifications