జగన్ పై రామగిరి ఎస్ఐ సుధాకర్ విమర్శల వెనుక కారణమిదే!
సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం పరిధిలోని పాపిరెడ్డి పల్లి లో దారుణ హత్యకు గురైన పార్టీ కార్యకర్త కురుబ లింగమయ్య కుటుంబాన్ని జగన్ పరామర్శించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన చంద్రబాబు పవన్ కళ్యాణ్ తో పాటు, కూటమి ప్రభుత్వ పాలన పైన, పోలీసుల వైఖరి పైన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు మెప్పు కోసం పోలీసులు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారన్నారు.
పోలీసులపై జగన్ తీవ్ర వ్యాఖ్యలకు రామగిరి ఎస్సై ఆగ్రహం
పోలీసులు తమ టోపీల పై ఉన్న సింహాలకు సెల్యూట్ కొట్టకుండా చంద్రబాబు చెప్పినట్లు చేస్తున్నారని, తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. అలాంటి పోలీసుల బట్టలూడదీసి ప్రజల ముందు దోషిగా నిలబెడతాం అంటూ వైసిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఇక ఈ క్రమంలో జగన్ వ్యాఖ్యలకు రామగిరి ఎస్సై సుధాకర్ ఘాటుగా స్పందించారు.

జగన్ జాగ్రత్తగా మాట్లాడాలన్న ఎస్సై
సెల్ఫీ వీడియో విడుదల చేసిన ఆయన పోలీసుల బట్టలూడదీసి కొడతాను అంటూ జగన్ హెచ్చరించడానికి తప్పుపట్టారు.ఖాకీ బట్టలు జగన్ ఇస్తే వేసుకునేవి కాదని కష్టపడి చదివి వేల మంది పోటీపడ్డ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించి వేసుకునేవి అని ఆయన పేర్కొన్నారు. ఎవరో వచ్చి ఊడదీస్తా అంటే ఊడదీయటానికి అరటి తొక్క కాదని, తాము నిజాయితీగా ప్రజల పక్షాన నిలబడతామని, అడ్డదారులు తొక్కబోమని, జగన్ జాగ్రత్తగా మాట్లాడాలని హెచ్చరించారు.
జగన్ పై ఎస్ఐ చేసిన వ్యాఖ్యలకు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కౌంటర్
ఇక తాజాగా ఎస్ఐ జగన్ పై చేసిన వ్యాఖ్యలకు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఎస్సై చేసిన వ్యాఖ్యల పైన ఆయన మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మెప్పు కోసమే రామగిరి ఎస్సై సుధాకర్ యాదవ్ ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తిగత స్వార్థం కోసమే ఆయన పని చేస్తున్నారన్నారు.
జగన్ ను విమర్శించే స్థాయి నీది కాదు
ఎస్ఐ సుధాకర్ యాదవ్ ఖాకీ షర్టును టిడిపికి తాకట్టు పెట్టాడని వ్యాఖ్యలు చేశారు. జగన్ ను విమర్శించే స్థాయి ఎస్సై సుధాకర్ యాదవ్ కు లేదని, ఆయన జగన్ పైన చేసిన వ్యాఖ్యలు సరికాదని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి వ్యాఖ్యానించారు. అసలు ఎస్ఐ సుధాకర్ సరిగా పని చేసి ఉంటే లింగమయ్య హత్య జరిగేదా చెప్పమని ఆయన ప్రశ్నించారు. సుధాకర్ వ్యవహార శైలి మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉందని పేర్కొన్నారు.
పరిటాల సునీత కోసం పని చేస్తున్నాడు
సుధాకర్ యాదవ్ ప్రోద్బలంతోనే టిడిపి నేతలు బరితెగిస్తున్నారు అని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. రామగిరి లో వైఎస్ఆర్సిపి కార్యకర్త కురుబ లింగమయ్య హత్యకు ఎస్ఐ సుధాకర్ కారణమని ఆరోపించారు. అతను పరిటాల సునీతకు అనుగుణంగా పనిచేస్తున్నారని విమర్శించారు. గతంలో దళితులను కూడా ఆయన కించపరిచారని పేర్కొన్నారు. రాజకీయాల్లోకి రావడం కోసం ఎస్సై ఈ తరహా ప్రయత్నాలు చేస్తున్నాడని అనుమానం వ్యక్తం చేశారు.
టికెట్ వస్తుందని ఎస్సై హంగామా
ఎస్ఐ సుధాకర్ యాదవ్ సంపాదించిన అక్రమాస్తులు చాలానే ఉన్నాయి కాబట్టి ఆయన రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు అని ఎమ్మెల్యే పరిటాల సునీత ద్వారా వచ్చే ఎన్నికల్లో టికెట్ పొందాలని భావిస్తున్నాడని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. సునీత ఇంకొకరికి టికెట్ ఇప్పించే స్థాయిలో లేరన్న విషయం సుధాకర్ తెలుసుకోవాలంటూ సూచించారు. ఎమ్మెల్యే పరిటాల సునీత చంద్రబాబును దూషించారని అందుకే ఆ కుటుంబానికి చంద్రబాబు వద్ద ప్రాధాన్యత లేకుండా పోయిందన్నారు.
ఖాకి చొక్కా ఇచ్చింది అందుకేనా?
అటువంటి పరిటాల సునీతను నమ్ముకుని నోటికొచ్చింది మాట్లాడితే కరెక్ట్ కాదన్నారు. కురుబా లింగమయ్య హత్య జరిగినప్పుడు ఎస్ఐ ఏం చేశాడో చెప్పాలని ప్రశ్నించారు. అప్పుడు ఆయన ధర్మసందేహాలు ఎక్కడికి పోయాయి అంటూ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి నిలదీశారు. ఎవరిని నమ్ముకుని ఇలా చేస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. టిడిపి నేతలకు చుట్టంగా పనిచేయడానికా ఖాకి చొక్కా ఇచ్చింది అంటూ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిలదీశారు.
జగన్ పర్యటన విషయంలోనే పోలీసుల ఆంక్షలు దేనికి
పోలీసులపైన ఎవరేం మాట్లాడినా కిక్కురుమనకుండా ఊరుకొని వైయస్ జగన్ పైన మాత్రం నోరేసుకుని పడుతున్నారా అంటూ ప్రశ్నించారు. పోలీసులపై అచ్చెన్నాయుడు చేసిన అనుచిత వ్యాఖ్యలు కనిపించవా? చంద్రబాబు చేసిన దూషణలు వినిపించవా? అని పోలీసులను ప్రశ్నించిన తోపుదుర్తి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాపిరెడ్డి పల్లి పర్యటన సమయంలోనే పోలీసుల ఆంక్షలు దేనికోసం అంటూ ఆయన అడిగారు.
జగన్ వ్యాఖ్యలలో తప్పేముంది
చంద్రబాబు మెప్పు కోసం పనిచేసే పోలీసులను బట్టలు ఊడదీసి అని వైయస్ జగన్ చేసిన వ్యాఖ్యలలో తప్పు ఏముంది అంటూ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రశ్నించారు. కురుబ లింగమయ్యను పరిటాల సునీత సమీప బంధువులు చంపితే, ఇక వారి అనుచరులనే సాక్షులుగా పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి అసహనం వ్యక్తం చేశారు. పోలీసుల తీరు అనుమానాస్పదంగా ఉందని, అందుకే వైసీపీ అధినేత పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారని మాజీ ఎమ్మెల్యే తేల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications