చంద్రబాబు వరం: ఫోన్లకు వెయ్యి రూపాయల రాయితీ..
ప్రజల్లో నూతన చైతన్యమే తీసుకురావడమే జన్మభూమి కార్యక్రమం లక్ష్యమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.
కర్నూలు: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా పర్యటన కొనసాగుతోంది. ఉదయం ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన ఆయన అనంతరం తడకనపల్లిలో జన్మభూమి-మావూరు కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజల్లో నూతన చైతన్యమే తీసుకురావడమే జన్మభూమి కార్యక్రమం లక్ష్యమన్నారు. సీమలో తుపాకుల ఆటలు పోయి జలక్రీడలు రావాలని ఈ సందర్బంగా సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.
ప్రజల్లో కృతజ్ఞతా భావం పెరగాలని ఈ సందర్బంగా చంద్రబాబు అన్నారు.తడకనపల్లెలో రూ. 2 కోట్లతో నిర్మించిన పశువుల హాస్టల్ 'క్షీరసాగర సదనం'ను ఈరోజు చంద్రబాబుప్రారంభించారు. క్షీరసాగర సదనం పేరును పశువుల వసతిగృహంగా మారుస్తున్నట్టు ప్రకటించారు. ఫైబర్ గ్రిడ్ ద్వారా ఇంటింటికీ ఇంటర్నెట్, టీవీ, టెలిఫోన్ సదుపాయం కల్పించనున్నట్టు చెప్పారు. నెలరోజుల్లోగా ఫైబర్ గ్రిడ్ ద్వారా గ్రామంలో ఇంటర్నెట్ కనెక్షన్లు ఇవ్వాల్సిందిగా కలెక్టర్లను ఆదేశించారు.

ఇకనుంచి నగదు రహిత లావాదేవీలకు ప్రజలు అలవాటు పడాలని సూచించారు. వేలిముద్ర, ఫోన్, డెబిట్/క్రెడిట్ కార్డుల ద్వారా లావాదేవీలు నిర్వహించుకోవాలన్నారు. గ్రామంలో అందరు మొబైల్ ఫోన్లు కొనుక్కోవాలని, ఇందుకోసం రూ.1000 వరకు రాయితీ ఇస్తామని ప్రకటించారు.
ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల ద్వారా తడకనపల్లి త్వరగా డిజిటల్ గ్రామంగా రూపుదిద్దుకోవాలని సీఎం ఆకాక్షించారు. ప్రతీ గ్రామంలో పశువుల వసతిగృహం ఏర్పాటుచేయాలని, కర్నూలు జిల్లాను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతానని అన్నారు.
రాష్ట్రంలో ప్రతీ కుటుంబం రూ.10వేల ఆదాయాన్ని సంపాదించుకునేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. ప్రజలు తమ గ్రామాల్లోనే వర్మీ కంపోస్టు తయారుచేసుకుంటే ప్రయోజనకరంగా ఉంటుందన్నారు.












Click it and Unblock the Notifications