వైసీపీ నేత హత్యలో అరెస్ట్, బాంబు బెదిరింపు..
నందిగామ పోలీసు స్టేషన్లో హత్య కేసు నమోదు అయింది. నందిగామతో పాటు ఇతర పోలీసు స్టేషన్లకు చెందిన సిబ్బంది నాలుగు బృందాలుగా ఆరు రోజుల నుండి నిందితుల కోసం తీవ్రంగా గాలించారు. శనివారం అర్ధరాత్రి కిరాయి హంతకుడు పాషాను నందిగామ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది. పాషాకు తుపాకి అద్దెకు ఇచ్చిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
భారీ ఎర్రచందనం డంప్
కృష్ణా జిల్లాలో భారీ ఎర్రచందనం డంప్ బయటపడింది. కొత్త ఆటోనగర్లోని గోడౌన్లో 50 టన్నుల ఎర్రచందనం నిల్వలను పోలీసులు గుర్తించారు. వీటి విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ.150 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అరెస్ట్ అయిన స్మగ్లర్ నరేష్ ఇచ్చిన సమాచారంతో విజయవాడలో డంప్ను పోలీసులు కనుగొన్నారు.
గత ఆరు నెలలుగా ఇక్కడ ఎర్రచందనం నిల్వ చేస్తున్నట్లు అధికారులు భావిస్తున్నారు. చిత్తూరు నుంచి విజయవాడ చేరుకున్న పోలీసులు పలువురు నిందితులను అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది. ఎర్ర చందనంతో పాటు తొమ్మిది వాహనాలు కూడా స్వాధీనం చేసుకున్నారు.
నరేష్ కడప జిల్లా రాయచోటికి చెందిన వాడు. అతనిని పోలీసులు చిత్తూరు జిల్లా పెనమలూరు ప్రాంతంలో అరెస్టు చేశారు. డంప్ విషయం తెలుసుకుని పెనమలూరు, చిత్తూరు టాస్క్ ఫోర్స్ పోలీసులు వెళ్లి పట్టుకున్నారు.
ఆత్మకూరులో బాంబు కలకలం
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని ఎస్బీఐ, ఆంధ్రా బ్యాంకుల్లో బాంబులు పెట్టామంటూ అగంతకులు ఫోన్ చేయడంతో పట్టణంలో కలకలం రేగింది. 100కు అగంతకులు ఫోన్ చేశారు. దీంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తమయ్యారు. బాంబు స్క్వాడ్ను పిలిపించి తనిఖీలు చేశారు. అయితే, బాంబులు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.