మూడు రాజధానుల స్థానంలో కొత్త వ్యూహం- అమరావతే ఇక : ఆ రెండు ఇలా -న్యాయ చిక్కులతో..!!
ఏపీలో మూడు రాజధానుల విషయంలో జగన్ ప్రభుత్వం కొత్త వ్యూహం అమలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. తాము నిర్ణయించిన విధంగా మూడు రాజధానుల విషయంలో ముందుకే వెళ్లాలని డిసైడ్ అయింది. కొద్ది నెలల క్రితం జరిగిన అసెంబ్లీ సమావేశంలో మూడు రాజధానుల బిల్లుతో పాటుగా సీఆర్డీఏ రద్దు బిల్లును రాష్ట్ర ప్రభుత్వం ఉప సంహరించుకుంది. అదే విషయాన్ని రాజధానుల వ్యవహారం పైన హైకోర్టులో కొనసాగుతున్న కేసుల విచారణ సమయంలోనూ స్పష్టం చేసింది. కానీ, బిల్లుల ఉప సంహరణ సమయంలోనే సీఎం జగన్ మరింత సమగ్రంగా మూడు రాజధానుల బిల్లును సభ ముందుకు తీసుకొస్తామనంటూ ప్రకటించారు. ఈ బిల్లుల ఉప సంహరణతో హైకోర్టులో కేసు తుది తీర్పు రావాల్సి ఉంది.

మూడు రాజధానుల స్థానంలో ఇలా..
అయితే, కొత్త జిల్లాల్లో ఉగాది నుంచి పాలన ప్రారంభించాలని భావిస్తున్న ఏపీ ప్రభుత్వం..ఇదే సమయంలో మూడు రాజధానుల విషయంలోనూ ముందుకే వెళ్లాలని డిసైడ్ అయింది. రానున్న బడ్జెట్ సమావేశాల్లోనే బిల్లు ప్రతిపాదించేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే, ఈ సమయంలో కీలక ప్రతిపాదనలు ప్రభుత్వం ముందుకొచ్చాయి. దీని పైన న్యాయ నిపుణుల సలహాలు..అనేక తర్జన భర్జన తరువాత ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. రాష్ట్రంలో మూడు రాజధానుల బదులు ఒక రాజధాని..రెండు ఉప రాజధానుల కాన్సెప్ట్ ను తెర మీదకు తెచ్చేందుకు కసరత్తు జరుగుతున్నట్లుగా సమాచారం. ఇప్పటికే ఇదే కాన్సెప్ట్ ను జార్ఖండ్ లోనూ అమల్లోకి తెస్తున్నారని చెబుతున్నారు.

న్యాయ చిక్కులు లేకుండా ముందుకెళ్లేలా
దీంతో.. న్యాయ పరమైన వివాదం లేకుండా... అమరావతిని రాష్ట్ర రాజధానిగా పేర్కొంటూనే విశాఖపట్నం, కర్నూలును ఉపరాజధానులుగా ప్రకటించనుంది. ఈ మేరకు రానున్న అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెట్టడానికి కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించి గతంలో వలే కోర్టులో సమస్యలు రాకుండా.. ఏ ప్రాంతం నుంచి అభ్యంతరాలు రాకుండా న్యాయ పరంగానూ..ఇటు రాజకీయంగానూ ఆచి తూచి బిల్లును సిద్దం చేస్తున్నట్లు సమాచారం. పరిపాలనా సౌలభ్యం రీత్యా ఉపరాజధానుల్లో అనుబంధ అనుబంధ కార్యాలయాలు ఏర్పాటు చేసుకునే విధంగా బిల్లులో ప్రస్తావించనున్నారు. అయితే, న్యాయ రాజధానిగా కర్నూలును ప్రతిపాదించినా..హైకోర్టు తరలింపు విషయంలో మాత్రం వ్యక్తం అవుతున్న అభిప్రాయాలు ఇబ్బందిగా మారే అవకాశం కనిపిస్తోంది.

సాంకేతిక అంశాలపై నిపుణుల అభిప్రాయాలు
దీంతో..బిల్లులో ఉప రాజధానులుగా మాత్రమే ప్రస్తావించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా..సినీ పరిశ్రమకు చెందిన వారితో జరిగిన సమావేశంలో సైతం సీఎం జగన్ త్వరలో అందరం విశాఖ వెళ్లాల్సిందేనంటూ వ్యాఖ్యానించారు. విశాఖలో స్టూడియో ల నిర్మాణానికి స్థలాలు కేటాయిస్తామని ప్రతిపాదించారు. మంత్రులు బొత్సా..కొడాలి నాని వంటి వారు సైతం ప్రతిపక్షాలు అడ్డుపడినా మూడు రాజధానుల నిర్ణయం ఆగదని..ప్రజామోదంతో మూడు రాజధానులు ఏర్పాటవుతాయని స్పష్టం చేసారు. అయితే, సీఆర్డీఏ విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్తారనేది ఆసక్తి కరంగా మారింది. సీఆర్డీఏ పేరుతోనే అమరావతి రైతులకు ఒప్పందాలు చేసి ఉండటంతో... సీఆర్డీఏ ను కొనసాగిస్తారని చెబుతున్నారు.

ఆచితూచి అమలు దిశగా అడుగులు
రాజధాని ప్రధానంగా అమరావతిగానే ఉండే పరిస్థితులు ఉండటంతో న్యాయ పరంగానూ సమస్యలు రావని అంచనా వేస్తున్నారు. కానీ, ఉప రాధానులు అనే అంశం న్యాయ పరంగా కొనసాగుతుందా అనే మరో సందేహం వ్యక్తం అవుతోంది. దీని పైన అధికార వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే, బిల్లులో ప్రస్తావించే అంశాలు.. ప్రభుత్వ కార్యాచరణ ఏంటనేది అసెంబ్లీలో బిల్లు ప్రతిపాదించన తరువాత మాత్రమే పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రతిపక్ష పార్టీలు మాత్రం అమరావతి రాజధానిగా కొనసాగుతుందని..ఎవరూ మార్చలేరంటూ ధీమాగా చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ తాజా వ్యూహం.. బిల్లు ప్రతిపాదన...మూడు రాజధానుల అంశం ఇప్పుడు రాజకీయంగా ఉత్కంఠకు కారణమవుతోంది.












Click it and Unblock the Notifications