ఏపీలో లక్షా 25 వేల కోట్ల పెట్టుబడులు - దావోస్ కేంద్రంగా ఎంఓయూలు : సీఎం సమక్షంలో..!!
దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా ఏపీ భవిష్యత్ కు సంబంధించి కీలక అడుగులు పడినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ముఖ్యమంత్రి జగన్ తో పాటుగా మంత్రులు..అధికారులు దావోస్ లో వరుస సమావేశాలు నిర్వహించారు. పలు అంతర్జాతీయ సంస్థల ముఖ్యులు..ప్రతినిధులతో సీఎం జగన్ భేటీ అయ్యారు. ఈ పర్యటన ద్వారా అదానీ, గ్రీన్కో, అరబిందో సంస్థలతో.. లక్షా 25 వేల కోట్ల రూపాయల మేర ఎంవోయూలు చేసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. మచిలీపట్నంలో గ్రీన్ ఎనర్జీ సెజ్ తో పాటుగా హైఎండ్ టెక్నాలజీ హబ్గా విశాఖను అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకున్నట్లు ప్రకటించింది.
గ్రీన్ ఎనర్జీలో 1.25 లక్షల కోట్ల మేర
గ్రీన్ ఎనర్జీకి సంబంధించి.. లక్షా 25 వేల కోట్ల రూపాయల పెట్టుబడులపై అదానీ, గ్రీన్కో, అరబిందోలతో ఒప్పందం కుదిరింది. పంప్డ్ స్టోరేజీ వంటి వినూత్న విధానాలతో 27 వేల 700 మెగావాట్ల క్లీన్ ఎనర్జీ రాష్ట్రంలో అందుబాటులోకి రానున్నట్లు తెలిపింది. ఆర్సెలర్ మిట్టల్ సంస్థ తొలిసారిగా గ్రీన్ ఎనర్జీలో పెట్టుబడులకు... ఏపీని వేదికగా చేసుకుందని ప్రభుత్వం పేర్కొంది. కర్బన రహిత పారిశ్రామికీకరణకు ఏపీ కేంద్రంగా నిలుస్తోందని నీతి ఆయోగ్ సీఈవో ప్రశంసించారు. దావోస్ పర్యటనలో విశాఖకు ప్రత్యేక గుర్తింపు దక్కిందని ప్రభుత్వం పేర్కొంది. హై ఎండ్ టెక్నాలజీ వేదికగా విశాఖను తీర్చిదిద్దుతున్నామని ఈ రంగంలో పెట్టుబడులకు ఆహ్వానం పలికినట్లు వెల్లడించింది.
విశాఖలో హై ఎండ్ టెక్నాలజీపై
ఆంధ్ర విశ్వవిద్యాలయంతో కలిసి హై ఎండ్ టెక్నాలజీపై పాఠ్యప్రణాళిక రూపకల్పనలో భాగస్వామ్యానికి టెక్ మహీంద్ర అంగీకారం తెలిపిందని వెల్లడించింది. ఐబీఎం ఛైర్మన్, సీఈవో అరవింద్ కృష్ణతోనూ ఈ అంశంపై సీఎం చర్చించారని ప్రభుత్వం చెప్పుకొచ్చింది. యూనికార్న్ స్టార్టప్స్కు వేదికగానూ విశాఖను తీర్చిదిద్దడానికి దావోస్ సదస్సులో సీఎం ప్రయత్నాలు చేశారని ప్రభుత్వం తెలిపింది. ఏపీలో విద్యారంగానికి తోడుగా నిలుస్తామని బైజూస్ సంస్థ ప్రకటించిందని పరిశోధక కేంద్రం ఏర్పాటుతో పాటు.. ఏపీ విద్యార్థులకు పాఠ్యప్రణాళికను అందిస్తామని.. సీఎంతో జరిగిన సమావేశంలో సంస్థ సీఈవో రవీంద్రన్ చెప్పినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇక, మచిలీపట్నం వేదికగా ఒక సెజ్ తీసుకొచ్చేలా ఒప్పందం జరిగిందని ప్రభుత్వం పేర్కొంది.
కాకినాడ పోర్టు పైనా
గ్రీన్ ఎనర్జీని వినియోగించుకోవడంతోపాటు.. అత్యాధునిక పద్ధతుల్లో ఉత్పత్తులు సాధించేందుకు వీలుగా ఈ జోన్ను అభివృద్ధి చేస్తారని వివరించింది. దీనికి సంబంధించి డబ్య్లూఈఎఫ్తో ఒప్పందం చేసుకుందని.. తెలిపింది. దస్సాల్ట్ సిస్టమ్స్, మిట్సుయి వోఎస్కే లైన్స్తో జరిగిన చర్చల్లో సీఎం ఇవే అంశాలపై దృష్టిసారించారని తెలిపింది. త్వరలో కాకినాడ పోర్టులో కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు మిట్సుయి వోఎస్కే లైన్స్ సంస్థ సీఈవో తకీషి హషిమొటో ప్రకటించారని ప్రభుత్వం పేర్కొంది. దావోస్ పర్యటనలో ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలో చక్కటి ఫలితాలు వచ్చాయని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.