మూడు కుటుంబాలు.. ఆరు పదవులు - చెప్పిందేంటీ, చేస్తుందేంటి..!!
తంత్రి - తనయుడు, అన్నా - తమ్ముడు, బాబాయ్ - అబ్బాయ్. ఇదీ కూటమి పాలనలో పదవుల పంపకాల్లో అమలు చేస్తున్న ఫ్యామిలీ ప్యాక్. చంద్రబాబు గతం కంటే ఇప్పుడు భిన్నంగా అమలు చేస్తున్న నిర్ణయాలు చర్చకు వస్తున్నాయి. కూటమి ధర్మం పేరుతో మెగా- నారా, నందమూరి కుటుంబాలకే ప్రాధాన్యత దక్కుతుందనే అభిప్రాయం ఉంది. రాజ్యసభ సభ్యులు.. నాగబాబును మంత్రి చేయాలనే నిర్ణయంతో ఫ్యామిలీ ప్యాక్ రాజకీయాలు కూటమి పార్టీల్లో ఆసక్తి కర చర్చకు కారణమవుతున్నాయి.
ఏం చెప్పారు - ఏం చేస్తున్నారు
నాడు జగన్ పైన ఫ్యామిలీ ప్యాక్ రాజకీయాల పైన పవన్ కీలక వ్యాఖ్యలు చేసారు. కుటుంబ రాజకీయాలు చేయకూడదని పవన్ పదే పదే చెప్పుకొచ్చారు. ప్రజారాజ్యం పైనా నాడు కుటుంబ పార్టీ అనే ముద్ర ఉండేది. చంద్రాబు గతంలో ఎన్నడూ నారా - నందమూరి కుటుంబ సభ్యులకు లెక్కకు మించి పదవులు కట్టబెట్ట లేదు. కుటుంబ సభ్యులను ప్రోత్సహించకుండా జాగ్రత్త పడే వారు. 2014 ఎన్నికల్లో టీడీపీ గెలుపులో లోకేష్ కీలకంగా వ్యవహరించినా.. 2017ల మంత్రివర్గ విస్తరణ వరకు మంత్రిగా తన కుమారుడికి అవకాశం ఇవ్వలేదు. ఈ సారి ఎన్నికల్లో లోకేష్ నేరుగా పార్టీ విజయం కోసం పని చేసారు. లోకేష్ ఇప్పుడు మంత్రివర్గంలో కీలకంగా మారారు. భవిష్యత్ ను దృష్టి లో ఉంచుకొని లోకేష్ ను చంద్రబాబు తీర్చి దిద్దుతున్నారనే అభిప్రాయం ఉంది.

నారా - నందమూరి - మెగా
కూటమి గెలుపులో పవన్ కీలకంగా వ్యవహరించారు. పవన్ కు డిప్యూటీ సీఎం పదవి దక్కింది. ఇక, జనసేన నుంచి ముగ్గురికి, బీజేపీ నుంచి ఒకరికి మంత్రి పదవులు దక్కాయి. ఇప్పుడు మెగా బ్రదర్ నాగబాబుకు మంత్రి పదవి ఖరారైంది. దీంతో.. అన్నా - తమ్ముడు ఇద్దరూ ఒకే మంత్రివర్గంలో పని చేయనున్నారు. గతంలో చిరంజీవి కేంద్ర మంత్రిగా పని చేయగా .. ఇప్పుడు ఈ ఇద్దరు రాష్ట్ర మంత్రులుగా అవకాశం దక్కింది. అదే విధంగా కింజరపు కుటుంబం నుంచి అచ్చెన్నాయుడు రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు. కేంద్రం, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో ఉండటంతో బాబాయ - అబ్బాయ్ కు ప్రాధాన్యత పెరిగింది.
బంధుత్వాలు - పదవులు
ఇక, నందమూరి బాలయ్య ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆయన పెద్దల్లుడు మంత్రిగా ఉండగా ..చిన్నల్లుడు ఎంపీగా ఉన్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీగా.. ఆయన సతీమణ ప్రశాంతి కోవూరు ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. ఇలా యనమల కుటుంబానికి పదవులు ఇచ్చారు. జగన్ హయాంలో కుటుంబ సభ్యులు.. బంధువులకే ప్రాధాన్యత ఇస్తున్నారని నాడు ఇదే కూటమి పార్టీల నేతలు విమర్శించారు. ఇప్పుడు మాత్రం కూటమిలోనూ ఫ్యామిలీ ప్యాక్ అమలు చేస్తున్నారు. రాజ్యసభ అభ్యర్దిత్వం కోసం టీడీపీలో సీనియర్లు ఆశలు పెట్టుకున్నారు. బీదా మస్తాన రావు పైన అభ్యంతరం లేకపోయినా.. సానా సతీష్ కు ఇవ్వటం పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మంత్రివర్గంలోకి నాగబాబును తీసుకోవటం పవన్ ను బుజ్జగించటం కోసమే అనే చర్చ వినిపిస్తోంది. మొత్తంగా కూటమిలో అమలవుతున్న ఫ్యామిలీ ప్యాక్ పై ఎన్నికల్లో గెలుపు కోసం పని చేసిన కేడర్ లో ఆసక్తి కర చర్చకు కారణమవుతోంది.












Click it and Unblock the Notifications