ఎపి రాజధాని చిక్కులు: 48 గంటల రైతు దీక్ష
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాజధానికి భూమిని సేకరించే విషయంలో ప్రభుత్వానికి చిక్కులు తప్పడం లేదు. పంట భూములు వదిలి రాజధాని నిర్మాణానికి ప్రభుత్వం పూనుకోవాలని కోరుతూ పెనుమాక రైతులు మంగళవారం 48 గంటల నిరాహారదీక్ష ప్రారంభించారు.
తాడేపల్లి మండలం పెనుమాక గ్రామానికి చెందిన 25 మంది రైతులు మంగళవారం ఉదయం ఆరు గంటలకు దీక్ష ప్రారంభించారు. బుధవారం సాయంత్రం 6 గంటల వరకు దీక్షలు కొనసాగిస్తామని చెప్పారు.
రాష్ట్రప్రభుత్వం రాజధాని పేరుతో బహుళ పంటలు పండే భూములను లాక్కోవడం న్యాయం కాదని రాజధాని రైతుల సంఘ నాయకుడు గుంటక నరేష్రెడ్డి అన్నారు.ప్రభుత్వానికి భూములిచ్చేది లేదని తొలి నుంచి చెప్తున్నప్పటికీ భయాందోళనకు గురి చేస్తోందని అన్నారు.
భూ సమీకరణ, భూ సేకరణ అంటూ ప్రభుత్వం రైతులపై ఒత్తిడి తెస్తోందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మారుమూల గ్రామాలుగా ఉన్న ఉండవల్లి, పెనుమాక గ్రామాలను భూ సమీకరణ నుంచి మినహాయించాలన్నారు.
ప్రభుత్వం ఇప్పటికే 33 వేల ఎకరాలు సేకరించినందున అదనంగా సమీకరించాల్సిన అవసరం లేదన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం రైతుల గొంతునొక్కే విధంగా వ్యవహరిస్తూ భూములను లాక్కోవడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు.
ఇప్పటికైనా ప్రభుత్వం రైతుల విజ్ఞప్తిని గుర్తించి పంటలు పండే భూములను రాజధాని నిర్మాణాల నుంచి మినహాయించాలని కోరారు. దీక్షలో రైతులు మేకా సాంబిరెడ్డి, కళ్లం వేణుగోపాలరెడ్డి, పోలిశెట్టి రామ్మోహనరావు, మన్నవ కృష్ణారావు, యర్రా పీరు, రాఘవరెడ్డి, మేకా సుబ్బారెడ్డి, గోరంట్ల సుబ్బారావు తదితరులు కూర్చున్నారు.