జీవితాంతం జగన్తోనే,స్నేహమంటే ఇదే.. 16నెలల జైలుజీవితమే నిదర్శనం.. విజయసాయి సంచలనం..
''ఏపీ హైకోర్టు తీర్పులు ఈ మధ్య చర్చనీయాంశం అవుతున్నాయి. వాటి గురించి నేను మాట్లాడను. అయితే ఈ దేశంలో కోర్టుల్ని, చట్టాలను పూర్తిగా విశ్వసించే పార్టీ ఏదైనా ఉందాంటే, అది వైసీపీనే. గత 10 ఏళ్లుగా మేం గాంధీమార్గంలోనే నడుస్తున్నాంతప్ప చట్టవ్యతిరేక కలాపాలకు పాల్పడలేదు. నాడు కాంగ్రెస్, టీడీపీ కలిసి మాపై తప్పుడు కేసులుపెట్టినా.. 16 నెలలపాటు జైలుకు పంపినా.. మేం శాంతియుతంగా, అదికూడా కోర్టుల్లో న్యాయంకోసం పోరాడామే తప్ప, వీధుల్లో అసాంఘిక చర్యలకు దిగలేదు. చట్టాలపట్ల వైసీపీకి ఉన్న నిబద్ధతకు ఇదే నిదర్శనం'' అని ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు.

వైజాగ్లో ప్రెస్మీట్..
మంత్రులు కన్నబాబు, అవంతి శ్రీనివాస్, వైసీపీకి చెందిన ముఖ్యనాయకులతో కలిసి సోమవారం విశాఖపట్నంలో పర్యటించిన ఎంపీ విజయసాయి రెడ్డి.. స్థానికంగా మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ ఢిల్లీ పర్యటన, నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వివాదం, టీడీపీ అధినేత చంద్రబాబు తీరు, వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు, వ్యక్తిగతంగా తనపై వస్తోన్న వార్తలు.. తదితర అంశాలపై ఎంపీ కూలంకుషంగా సమాధానాలిచ్చారు. ఈక్రమంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంపీ కామెంట్లు ఆయన మాటల్లోనే...

నిమ్మగడ్డ క్రిమినాలిటీ..
‘‘నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వ్యవహరించిన తీరు నిజంగా ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టులాంటిది. రాజ్యాంగ పదవిలో ఉంటూ ప్రభుత్వం మీద విషం కక్కారు. అధికార పార్టీని ఫ్యాక్షనిస్టులు, గుండాలుగా పేర్కొంటూ కేంద్రానికి లేఖరాశారు. అది టీడీపీ ఆఫీసులో తయారైన లేఖ అని పోలీసుల ఎంక్వైరీలో తేలింది. నిమ్మగడ్డ క్రిమినాలిటీకి పాల్పడ్డారనడంలో ఎలాంటి సందేహం లేదు. అసలాయన ప్రజాస్వామ్యానికి రక్షకుడిగా ఉండాలనుకున్నారా? లేక హత్యచేయాలనుకున్నారా? హైకోర్టు తీర్పు ప్రకారం.. చంద్రబాబు హయాంలో చేపట్టిన నిమ్మగడ్డ నియామకం కూడా చెల్లుబాటు కాదని అడ్వొకేట్ జనరల్ ఓ పాయింట్ ను లేవనెత్తారు. దానికి వాళ్ల దగ్గర సమాధానం లేదు. ఎంతసేపూ నా పోస్టు నాకు కావాలని.. తనకు తానే ఆర్డర్లు రాసుకోవడం బహుశా నిమ్మగడ్డ ఒక్కరికే సాధ్యమైంది.

టీడీపీకి సంబంధమేంటి?
రమేశ్ కుమార్ పదవిపై హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత టీడీపీ వాళ్లు పెద్ద ఎత్తున సంబురాలు చేసుకున్నారు. బహుశా నిమ్మగడ్డ కూడా అంతగా ఆనందించి ఉండరు. పదవీ కాలాన్ని తగ్గించినందుకు నిమ్మగడ్డ కోర్టుకు వెళ్లారంటే అర్థముంది, కానీ టీడీపీ కూడా ఆయనే ఉండాలని కోరడమేంటి? ఒక రాజ్యాంగ బద్ధ పోస్టుపై రాజకీయ పార్టీకి ఇంత ఇంట్రెస్ట్ ఏంటి? నిమ్మగడ్డ విషయంలో చంద్రబాబు కుట్రపూరితంగా, వ్యూహాత్మకంగా వ్యవహరించాడు. ఇదొక్కటేకాదు.. తన ప్రభుత్వం లేకపోయినా.. అన్ని వ్యవస్థల్లో తన మనుషులే ఉండాలనే భావన తనది. ఆక్రమంలో వ్యవస్థలన్నింటినీ బాబు భ్రష్టుపట్టిస్తున్నాడు. టీడీపీ హయాంలో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై జరిపిన తీరుగా.. ఇప్పుడు మేం కూడా దాడులు, కేసులు పెడితే ఏపీలో జైళ్లు కూడా సరిపోవు.

స్నేహమంటే ఇదేరా..
హైకోర్టు తీర్పులపై కామెంట్లు పెట్టారని వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై, అభిమానులపై కేసులు పెట్టారు. వాటిలో క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయి. ఈ సందర్భంగా నేను చెప్పదల్చుకున్నది ఒకటే.. మాకు చట్టాల పట్ల గౌరవం ఉంది. కానీ కేసులు మోపినంత మాత్రాన మా వాళ్లను మేం దూరం చేసుకోబోము. దోషులుగా నిరూపితం అయ్యేదాకా నిందితులు అమాయకులే అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. నాడు మహానేత వైఎస్సార్ తన అనుచరుల్లో ఒకరు దోషిగా తేలిన తర్వాత కూడా జైలుకు వెళ్లి పరామర్శించి వచ్చారు. అదీ.. స్నేహమంటే. మా అధినేతగానీ, మేముగానీ పార్టీ కార్యకర్తలు, సోషల్ మీడియా వాలంటీర్లకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం. కేసులు ఎదురైనంత మాత్రాన అలా వదిలేయబోము, అన్ని విషయాల్లో వాళ్లకు సపోర్ట్ గా నిలుస్తామని భరోసా ఇస్తున్నా. మనుషుల్ని వాడుకుని వదిలేయడం మా అలవాటుకాదు.

వైసీపీకి అన్నీ నేనే..
పార్టీకి సంబంధించిన అన్ని వ్యవహారాలను నేనే చూసుకుంటున్నాను. సోషల్ మీడియా వింగ్ కూడా నా ఆధ్వర్యంలోనే నడుస్తోంది. భవిష్యత్తులోనూ అన్నీ నేనే చూసుకుంటాను. కానీ ఈ మధ్య నాపై తప్పుడు ప్రచారం జరుగుతోంది. మా అధినేత నన్నేదో దూరం పెట్టేశారని కొన్ని చానెళ్లలో చూపించారు. అందులో ఇసుమంతైనా నిజం లేదు. ఎందుకంటే నాకు, వైఎస్ కుటుంబానికి గాఢానుబంధం ఉంది. జీవితాంతం.. చనిపోయేదాకా నేను జగన్ తోనే ఉంటాను.. ఆయన కోసమే పనిచేస్తాను.. దయచేసి మేం దూరమయ్యామనే వార్తలు రాయకండి..''అని విజయసాయి రెడ్డి భావోద్వేగంగా చెప్పారు.
Recommended Video

ఢిల్లీకి జగన్.. తెలంగాణపై ఫిర్యాదా?
ఏపీ సీఎం జగన్ మంగళవారం ఢిల్లీ వెళతారని, అక్కడ కేంద్ర హోం మంత్రి, జలశక్తి మంత్రులతోపాటు వీలైతే గనుల శాఖ మంత్రిని కూడా కలుస్తారని ఎంపీ విజయసాయి తెలిపారు. సీఎంతోపాటు మంత్రులు, అధికారులు, తాను కూడా వెళుతున్నట్లు చెప్పారు. కాగా, తెలంగాణతో జల జగడం నేపథ్యంలో కేంద్రానికి ఫిర్యాదు చేస్తారా? అన్న ప్రశ్నకు.. ‘‘ఏదైనా సమస్య ఉంటే తెలంగాణ ప్రభుత్వంతో చర్చించి మాట్లాడుకుంటాం.. దానికి ఢిల్లీకి ఏం సంబంధం? దయచేసి ఇలాంటి హైపోథెటికల్ ప్రశ్నలు మానండి''అని ఎంపీ బదులిచ్చారు.












Click it and Unblock the Notifications