రథ సప్తమినాడు శక్తిమంతురాలైన ఆ అమ్మవారి కటాక్షం దక్కాలంటే..
Ratha Saptami 2025: ఫిబ్రవరి 4వ తేదీన రథసప్తమి. హిందూ పంచాంగం ప్రకారం- ప్రతి సంవత్సరం మాఘ మాసంలోని శుక్ల పక్షం ఏడవ రోజును రథ సప్తమిగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ పండగను అచల సప్తమి, సూర్య జయంతిగా పిలుస్తారు. పురాణాల ప్రకారం సూర్య భగవానుడు మాఘ శుక్ల పక్షమి రోజునే జన్మించాడు.
ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఉత్సవాలను నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ముందస్తు ఏర్పాట్లు మొదలు పెట్టారు. వేలాది మంది భక్తులు ఆలయాన్ని సందర్శించే అవకాశం ఉందని అంచనా వేస్తోన్నారు.

రథ సప్తమి నాడు అమ్మవారు ఏడు ప్రధాన వాహనాలపై ఊరేగనున్నారు. భక్తులను అనుగ్రహించనున్నారు. రథ సప్తమి నాడు ఉదయం 7 నుండి 8 గంటల వరకు సూర్యప్రభ వాహనం, 8:30 నుండి 9:30 గంటల వరకు హంస వాహనం, 10 నుండి 11 గంటల వరకు అశ్వ వాహనం, 11:30 నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు గరుడ వాహనంపై విహరించి భక్తులను కటాక్షించనున్నారు.
మధ్యాహ్నం 1 నుండి 2 గంటల వరకు చిన్నశేష వాహనం, సాయంత్రం 6 నుండి రాత్రి 7 గంటల వరకు చంద్రప్రభ వాహనం, రాత్రి 8:30 నుండి 9:30 గంటల వరకు గజ వాహనంపై దర్శనమిస్తారు. మధ్యాహ్నం 3:30 నుండి 4:30 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలోని శ్రీ కృష్ణస్వామివారి ముఖ మండపంలో అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు.
ఈ సందర్భంగా అమ్మవారి ఆలయంలో నిర్వహించే ఆర్జిత కల్యాణోత్సవం, కుంకుమార్చన, బ్రేక్ దర్శనం, ఊంజల సేవలను టీటీడీ రద్దు చేసింది. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం పక్కన గల శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో ఉదయం 6 నుండి 7 గంటల వరకు స్వామివారు అశ్వవాహనాన్ని అధిష్టించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.
శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయంలో రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని జనవరి 28వ తేదీ ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. తెల్లవారు జామున సుప్రభాతంతో శ్రీ పద్మావతి అమ్మవారిని మేల్కొలుపుతారు. సహస్రనామార్చన నిర్వహిస్తారు. అనంతరం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపడతారు అర్చకులు, టీటీడీ అధికారులు.
ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామాగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేస్తారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు.
అనంతరం భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయంలో నిర్వహించే ఆర్జిత కల్యాణోత్సవం, కుంకుమార్చన, బ్రేక్ దర్శనం, ఊంజల సేవలను టీటీడీ రద్దు చేసింది.












Click it and Unblock the Notifications