తిరుమల లడ్డూ వివాదంతో అయోధ్య రామాలయం సంచలన నిర్ణయం!
తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. గత ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూలకి ఉపయోగించిన నెయ్యిలో కల్తీ జరిగిందని అందులో జంతువుల కొవ్వు, వెజిటబుల్ ఆయిల్ ఉపయోగించటం జరిగిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించడంతో పాటు లాబ్ రిపోర్టులు కూడా ఈ విషయాన్ని తేటతెల్లం చేయడంతో ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన తిరుమల శ్రీవారి ఆలయంలో అపచారం జరిగినట్లుగా హైందవ సమాజం భావించింది.
దేశ వ్యాప్తంగా ఆలయాలలో ప్రసాదాలపై దృష్టి
హిందువుల నుండి ఈ ఘటన నేపథ్యంలో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. తిరుమల ఆలయ పవిత్రతను కాపాడడానికి చర్యలు తీసుకోవడం కోసం ప్రభుత్వం ముందుకు రావాలన్న డిమాండ్ ప్రధానంగా వినిపిస్తుంది. ఇక మరోవైపు గతంలో జగన్ సర్కార్ హయాంలో తిరుమలలో లడ్డూలలో కల్తీ జరిగిందని, తిరుమలలో అన్నప్రసాదం కూడా నాణ్యత లేకుండా పోయిందని పెద్దఎత్తున విమర్శలు వ్యక్తం అవుతున్న వేళ దేశవ్యాప్తంగా అనేక ఆలయాలలో ప్రసాదాల తయారీపైన దృష్టి సారించారు.

తెలంగాణా రాష్ట్రంలోనూ ప్రసాదాల తయారీపై ఫోకస్
ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని ఆలయాలలోని ప్రసాదాలను, నాణ్యత ప్రమాణాలను పరిశీలించడానికి ల్యాబ్ కు పంపించారు. నాణ్యత ప్రమాణాలను పరిశీలించిన తర్వాత ఎక్కడికక్కడ ఆలయాలలో ప్రసాదాల తయారీ విషయంలో నాణ్యత పైన, ఆలయాల పవిత్రతను కాపాడడం పైన దృష్టి సారించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది.
ఆలయాలలో ప్రసాదాలపై ఫోకస్
తాజా పరిణామాలతో అన్ని రాష్ట్రాలలోని ప్రభుత్వాలు, ఆలయాలలో ప్రసాదాలపైన ప్రత్యేకమైన దృష్టిని సారించాయి.
ఇక తిరుమల శ్రీవారి లడ్డూలు గత ప్రభుత్వ హయాంలో రామమందిరం ప్రారంభోత్సవ సమయంలో లక్ష లడ్డూలను కూడా పంపించడం జరిగింది. ప్రస్తుతం కల్తీ జరిగిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న సమయంలోనే ఈ లడ్డూలు తిరుమల నుండి అయోధ్యకు పంపిణీ చేయడం జరిగింది.తిరుమల లడ్డు కల్తీపై దేశవ్యాప్తంగా వివాదం చెలరేగినవేళ అయోధ్యలోని రామ మందిర నిర్వాహకులు సంచలననిర్ణయం తీసుకున్నారు.
బయట ప్రసాదాలు అయోధ్యలో నిషేధం
గత కొద్ది రోజులుగా తిరుమల లడ్డు తయారీకి ఉపయోగించిన నెయ్యిలో కల్తీ జరిగిందన్న వార్తల నేపథ్యం భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసిన క్రమంలో అయోధ్యలోని శ్రీరాముని ఆలయం నిర్వాహకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. బాలరాముడికి బయట సంస్థలు తయారు చేసిన ప్రసాదాలను నైవేద్యంగా పెట్టడం పైన నిషేధం విధించారు.
అన్ని ఆలయాలలో ప్రసాదాలపై డిమాండ్
అయోధ్య రామాలయంలో ఆలయ పూజారుల సమక్షంలో తయారు చేసిన ప్రసాదాలనే శ్రీరాముడికి నైవేద్యం పెట్టాలని భక్తులకు ప్రసాదంగా అందించాలని నిర్ణయించినట్టు ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ ఈ సందర్భంగా వెల్లడించారు. ఒక అయోధ్యలోని శ్రీరాముని ఆలయంలో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయాలలోనూ బయట వ్యక్తులు తయారు చేసిన ప్రసాదాలను నిషేధించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఆలయ పూజారుల పర్యవేక్షణలోనే ప్రసాదాల తయారీ డిమాండ్
తిరుమలలో లడ్డు ప్రసాదాల తయారీ మొత్తం ఆలయ పూజారుల పర్యవేక్షణలోనే జరిపించాలనీ ఆయన డిమాండ్ చేశారు. ఇది భగవంతుడి పవిత్రతకు కోట్లాదిమంది భక్తుల యొక్క విశ్వాసానికి ముడిపడి ఉన్న అంశమని ఆయన తెలిపారు. తిరుమల శ్రీవారి ఆలయంలో లడ్డూల తయారీలో జంతువుల కొవ్వు కలిసిన ఆరోపణలపైన దేశవ్యాప్తంగా భక్తులు, సాధువులు, సన్యాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని, ఇలాంటి దుష్పరిణామాలు జరగకుండా ఉండడం కోసమే తాము అయోధ్య ఆలయంలో ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.












Click it and Unblock the Notifications