తిరుమల లడ్డూ వివాదం.. వైఎస్ జగన్ ఇంటి వద్ద ఉద్రిక్తత!
తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ వివాదం ఏపీలో ఉద్రిక్త పరిస్థితికి కారణంగా మారింది. ప్రస్తుతం తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ వ్యవహారం పైన దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ జగన్ సర్కార్ హయాంలో జరిగిన ఈ కల్తీపైన హిందూ సంఘాలు, ఏపీలోని పలు రాజకీయ పార్టీలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి.
జగన్ ఇంటి వద్ద ఉద్రిక్తత
ఈ క్రమంలో తాజాగా బీజేపీ యువ మోర్చా నేతలు మాజీ సీఎం జగన్ నివాసాన్ని ముట్టడించి ఆందోళన చేపట్టారు.ఇంటి బయట బైఠాయించి ఆందోళనకు దిగిన వారు గత ప్రభుత్వం హిందువుల మనోభావాలను దెబ్బతీసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే మాజీ సీఎం హిందువులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. గత ప్రభుత్వం శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని అపవిత్రం చేసిందని నిరసన వ్యక్తం చేస్తున్నారు.

ఆందోళన చేస్తున్న బీజేపీ యువ మోర్చా.. రంగంలోకి పోలీసులు
ఇక బీజేపీ యువ మోర్చా ఆందోళనకారులను కంట్రోల్ చేయడానికి పోలీసులు అక్కడ రంగంలోకి దిగారు. తిరుపతి లడ్డు ప్రసాదంలో అవినీతి జరిగిందని, జంతువుల కొవ్వును తిరుపతి లడ్డు తయారీలో వినియోగించారన్న ఆరోపణల నేపథ్యంలో తీవ్ర ఆగ్రహానికి గురై జగన్ ఇంటి వద్ద ఆందోళన చేస్తున్న ఆందోళన కారులను కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
జగన్ టార్గెట్ గా ఆరోపణలు
దేశవ్యాప్తంగా ఈ వ్యవహారం పైన దుమారం రేగుతున్న వేళ ముఖ్యంగా హిందువులు ఆగ్రహంతో ఊగిపోతున్న వేళ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఏపీలోని ఎన్డీఏ కూటమి పార్టీలు పెద్ద ఎత్తున టార్గెట్ చేస్తున్నాయి. ఇప్పటికే ఈ వ్యవహారం అంతా జగన్మోహన్ రెడ్డికి తెలిసే జరిగిందని, కమిషన్ల కోసం కక్కుర్తి పడి జగన్ ఈ వ్యవహారాన్ని నడిపించారని పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు ఆరోపిస్తున్నారు.
సీబీఐ విచారణకు పెరుగుతున్న డిమాండ్
టీటీడీలో జరిగిన అక్రమాల పైన విచారణ జరపాల్సిన అవసరం ఉందని, సిబిఐతో విచారణ చేయిస్తే అసలు నిజాలు బయటకు వస్తాయని కూడా పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తుంది. దేశంలో కోట్లాదిమంది ఎంతో పవిత్రంగా భావించే తిరుమల తిరుపతి స్వామి వారి ప్రసాదాన్ని అపవిత్రం చేయడం క్షమించరాని నేరమని ఇప్పటికే పేర్కొన్న జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇది హిందువుల మనోభావాలను కించపరచటం అని పేర్కొన్నారు.
పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష
తిరుమల స్వామి వారికి అపచారం జరిగిన నేపధ్యంలో గుంటూరు జిల్లా నంబూరు లోని శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రాయశ్చిత్త దీక్ష మొదలుపెట్టారు తిరుపతి లడ్డు ప్రసాద్ అపవిత్రమైన నేపథ్యంలో క్షమించమని శ్రీ వెంకటేశ్వర స్వామి కోరుతూ ఆయన దీక్ష మాలధారణ తీసుకున్నారు మొత్తం 11 రోజులపాటు పవన్ కళ్యాణ్ దీక్ష కొనసాగనుంది.












Click it and Unblock the Notifications