తిరుమల లడ్డు కల్తీపై తెలంగాణాలో దీక్ష, జగన్ కు వీహెచ్ సూచన!
దేశవ్యాప్తంగా తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ పైన వివాదం కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా హిందూ ధర్మాన్ని పాటించే ఎంతోమంది ఈ ఘటనపై స్పందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుమల లడ్డు కల్తీ పైన రాజకీయ పార్టీల మధ్య మాటలు యుద్ధం కొనసాగుతుంది. ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలోనూ తిరుమల లడ్డు పైన ఆసక్తికర చర్చ జరుగుతుంది.
టిటిడి వెంకటేశ్వరస్వామి దేవాలయం వద్ద వీహెచ్ దీక్ష
పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డూను కల్తీ చేస్తారా అంటూ ప్రజల నుండి ఆగ్రహం వ్యక్తం అవుతుంది. ఈరోజు ఉదయం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు తిరుమల లడ్డుని అపవిత్రం చేశారన్న అంశం పైన ఏకంగా దీక్షకు దిగారు. ఉదయం 9గంటలకు హిమాయత్ నగర్ లిబర్టీ టిటిడి వెంకటేశ్వరస్వామి దేవాలయం వద్ద వి. హనుమంతరావు దీక్షను కొనసాగించారు. మధ్యాహ్నం 12 గంటల వరకు ఆయన దీక్షను కొనసాగించారు.

సిబిఐ విచారణ జరపాలని డిమాండ్
లిబర్టీ టిటిడి వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద మాజీ ఎంపీ హనుమంతరావు తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రసాదాన్ని అపవిత్రం చేయడంపైన తన నిరసన వ్యక్తం చేస్తూ దీక్ష చేపట్టారు. ఇక ఆపై మీడియాతో మాట్లాడిన విహెచ్ తిరుమలలో పవిత్రమైన లడ్డు తయారీలో కల్తీ జరిగిందన్న ప్రచారం పైన సిబిఐ విచారణ జరపాలని కోరుతూ తన డిమాండ్ వినిపించారు.
వైఎస్ జగన్ కు వీహెచ్ సూచన
తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగించినట్టు పలు నివేదికలు స్పష్టం చేస్తున్న నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని సిబిఐతో విచారణ చేయాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఇక ఇదే విషయంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి కూడా సిబిఐ విచారణ జరపాలని కేంద్రాన్ని డిమాండ్ చేయాలంటూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు సూచించారు
తప్పు చేసిన వారికి తప్పకుండా శిక్ష పడాలి
సిబిఐ విచారణ ప్రధాని నరేంద్ర మోడీ చేతిలోనే ఉంటుందని, దాంతో ఈ అంశాన్ని సిబిఐతో విచారణ జరిపించాలని పేర్కొన్నారు మూడు నెలల్లో సిబిఐ విచారణను పూర్తి చేయాలన్నారు. తప్పు చేసిన వారికి తప్పకుండా శిక్ష పడాలని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.
ఇంత అపచారం ఎన్నడూ చూడలేదు
శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదానికి వినియోగించిన నెయ్యిలో చేపనూనె, ఎద్దు కొవ్వు కలిపారని చెబుతున్నారని ఇంత అపచారం నేను గతంలో ఎప్పుడు చూడలేదని వీహెచ్ పేర్కొన్నారు .తిరుమలలో భక్తులను స్వామివారి దర్శనానికి పంపే విషయంలో అవినీతి జరిగిందంటే ఏమో అనుకోవచ్చు అని కానీ, స్వామి వారి ప్రసాదం తయారీలో సైతం అవినీతినా అంటూ వి హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications