ఏపీ అసెంబ్లీ సమావేశాలు లేనట్టే? ఆర్డినెన్స్ ద్వారా బడ్జెట్: మళ్లీ ఎప్పుడు?
అమరావతి: రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల తరువాత.. ఇక తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక వేడి రాజుకుంటోంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇప్పటికే వెలువడింది. వచ్చనెల 17వ తేదీన ఉప ఎన్నిక పోలింగ్ ఉంటుంది. తెలంగాణలోని నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానానికి కూడా అదే రోజు పోలింగ్ నిర్వహిస్తారు. తిరుపతి కోసం అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం.. తమ అభ్యర్థులను ప్రకటించాయి. ఈ ఉప ఎన్నిక పోటీ రేసు నుంచి జనసేన తప్పుకొన్న నేపథ్యంలో.. దాని మిత్రపక్షం భారతీయ జనతా పార్టీ బరిలో దిగనుంది. ఇంకా అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది.

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై ఎఫెక్ట్..
తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక నోటిఫికేషన్ ప్రభావం.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై పడినట్టే కనిపిస్తోంది. ఈ నెల 23వ తేదీ నుంచి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రానుంది. మే 2వ తేదీ నాడు ఫలితాలు వెలువడేంత వరకూ ఇది అమల్లో ఉంటుంది. ఎన్నికల కోడ్ తిరుపతి లోక్సభ స్థానానికి మాత్రమే వర్తిస్తుంది. ప్రవర్తనా నియమావళి అమల్లోకి రానున్న ప్రస్తుత పరిస్థితుల్లో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలా? వద్దా? అనే విషయంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తర్జనభర్జన పడుతున్నారని అంటున్నారు.

అధికారులు, అసెంబ్లీ కార్యదర్శితో మంతనాలు..
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై వైఎస్ జగన్.. అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు, ఇతర అధికారులతో బుధవారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు. సమావేశాలను వాయిదా వేస్తేనే మంచిదనే అభిప్రాయాన్ని వారు వెలిబుచ్చినట్లు తెలుస్తోంది. మే 2వ తేదీన ఓట్ల లెక్కింపు ఉండగా.. 4న ఎన్నికల ప్రవర్తనా నియమావళి తొలగిపోతుంది. అయినప్పటికీ- అదే నెల 6వ తేదీ నుంచి విశాఖపట్నానికి రాజధానిని తరలించే ప్రక్రియను చేపట్టాల్సి ఉన్నందున.. అసెంబ్లీ భేటీని జూన్ వరకూ వాయిదా వేయాలనే అభిప్రాయం కూడా ఈ సమావేశంలో వ్యక్తమైనట్లు సమాచారం. కొంత తర్జనభర్జనల తరువాత వాయిదా వేయడానికి వైఎస్ జగన్ మొగ్గు చూపారని తెలుస్తోంది.

షెడ్యూల్ ప్రకారం.. శుక్రవారం నుంచే..
ముందుగా ఖరారు చేసిన షెడ్యూల్ ప్రకారం.. శుక్రవారం నుంచే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కావాల్సి ఉంది. కనీసం వారం రోజుల పాటు భేటీని నిర్వహించాలని అధికార పార్టీ నిర్ణయించింది. 22వ తేదీన బడ్జెట్ను ప్రవేశపెట్టేలా తాత్కలిక షెడ్యూల్ను నిర్ధారించింది. ఈ సారి జెండర్ బడ్జెట్ను ప్రవేశపెడతామని ముఖ్యమంత్రి ఇదివరకే ప్రకటించారు కూడా. ఈ లోగా తిరుపతి ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల కావడంతో ప్రభుత్వం పునరాలోచనలో పడింది. దీనిపై అధికారులు, అసెంబ్లీ కార్యదర్శితో సంప్రదింపులు జరిపిన తరువాత వాయిదా వేయడానికే అంగీకరించినట్లు చెబుతున్నారు. ఏప్రిల్, మే నెలలకు అవసరమైన బడ్జెట్ ప్రతిపాదనలను ఆర్డినెన్స్ ద్వారా ఆమోదింపజేసుకోవాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం.

ప్రచారానికి అందుబాటులో ఉండేలా..
తిరుపతి లోక్సభ చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో విస్తరించి ఉంది. చిత్తూరు జిల్లాలోని తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి, సూళ్లూరుపేట, గూడూరు, సర్వేపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలు దీని కిందికే వస్తాయి. ఈ రెండు జిల్లాలకు చెందిన మంత్రులు, పార్టీ నాయకులు విస్తృతంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉంటుంది. అసెంబ్లీని వాయిదా వేయడం వల్ల మంత్రులు, ఆయా జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు.. ఎంపీలు ఎన్నికల ప్రచార కార్యక్రమాలపై దృష్టి సారించడానికి వెసలుబాటు లభిస్తుందనే అభిప్రాయం కూడా వైఎస్సార్సీపీ నేతల్లో వ్యక్తమౌతోంది.












Click it and Unblock the Notifications