తిరుపతిలో రోజుకో మలుపు -జగన్, పవన్ దూరం- బాబుపై రాళ్ల దాడి- ఏం జరుగుతోంది ?
ఏపీలో రెండేళ్ల వైసీపీ పాలనకు రిఫరెండంగా ప్రభుత్వ పెద్దలు చెప్పుకున్న తిరుపతి ఉపఎన్నికలో గెలుపు రాష్ట్రంలో భవిష్యత్ రాజకీయాల్ని శాసించబోతోందా ? వరుస ఓటములతో డీలాపడ్డా ప్రతిపక్షాలు పుంజుకునేందుకు తిరుపతిలో అంత స్కోప్ కనిపిస్తోందా ? ఓ దశలో సీఎం జగన్ రంగంలోకి దిగాలని భావించిన తిరుపతి ఉపఎన్నిక ప్రచారానికి ఆయన ఎందుకు దూరమయ్యారు ? చివరినిమిషంలో పవన్ కళ్యాణ్ బీజేపీకి హ్యాండ్ ఇవ్వడం వెనుక కారణాలేంటి ? చివరిగా చంద్రబాబుపై మాటల దాడి నుంచి రాళ్ల దాడికి దారి తీసిన పరిణామాలేంటి ? రాష్ట్రంలో సగటు ప్రజల మనసుల్ని తొలిచేస్తున్న ప్రశ్నలివి...
తిరుపతిలో అనూహ్య పరిణామాలు
తిరుపతి ఉపఎన్నిక ప్రచారం రోజుకో మలుపు తిరుగుతోంది. తొలుత సీఎం జగన్ రావాల్సిన అవసరం లేకుండానే వైసీపీ నేతలు ముగిస్తారని భావించిన ప్రచారానికి ఆయన రాక తప్పని పరిస్దితి ఎదురైంది. దీన్ని విపక్షాలు ఎప్పుడు రాజకీయం చేయడం మొదలుపెట్టాయో అప్పుడే జగన్ వెనక్కి తగ్గారు. అదే సమయంలో అప్పటివరకూ బీజేపీకి అండగా తిరుపతి ఫలితాన్ని తారుమారు చేస్తాడని భావించిన పవన్ కళ్యాణ్ క్వారంటైన్లోకి వెళ్లిపోయారు. ఇప్పుడిక తమకు తిరుగులేదని టీడీపీ భావిస్తున్న తరుణంలో చంద్రబాబుపై రాళ్లదాడి జరగడం ఇవన్నీ తిరుపతి ఫలితాన్ని తారుమారు చేయబోతున్నాయా అంటే అవునని కచ్చితంగా చెప్పలేం.
జగన్, పవన్ నిర్ణయాలే టర్నింగ్ పాయింట్ ?
గతంలో జరిగిన ఎన్నో ఉపఎన్నికలు, సార్వత్రిక ఎన్నికల్లో సైతం వైసీపీకి ఒంటిచేత్తో విజయాలు కట్టబెట్టిన వైఎస్ జగన్ తిరుపతి ఉపఎన్నిక విషయానికొచ్చేసరికి తడబడుతున్నట్లు కనిపించారు. తొలుత ప్రచారానికి వెళ్లకూడదని భావించడం, ఆ తర్వాత వెళ్లాలని నిర్ణయం తీసుకోవడం, చివరికి దాన్ని రద్దు చేసుకోవడం.. ఇలా జగన్ ఎప్పుడూ తడబడింది లేదు. దీంతో వైసీపీ క్యాడర్లోనే ఓ రకమైన గందరగోళం నెలకొంది. మరోవైపు ఈ ఎన్నికలో తమకు తురుపుముక్కగా భావించి ఏకంగా భవిష్యత్తులో సీఎం చేస్తామని బీజేపీ హామీ ఇచ్చినా పవన్ కళ్యాణ్ మద్యలోనే ప్రచార బరి నుంచి తప్పుకున్నారు. దీనిపైనా భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. అయితే వీరిద్దరూ కరోనా కారణంగానే ప్రచారం నుంచి తప్పుకున్నట్లు ప్రకటించడం ఇక్కడ విశేషం.
మిగిలిన ప్రధాన నేత చంద్రబాబే
తిరుపతి ఉపఎన్నిక ప్రచారంలో వాస్తవానికి వైసీపీ తరఫున సీఎం జగన్, బీజేపీ-జనసేన తరఫున పవన్ కళ్యాణ్, టీడీపీ తరఫున చంద్రబాబు స్టార్ క్యాంపెయినర్లు. ఇందులో జగన్ ప్రచారం తప్పనిసరని వైసీపీ భావించినా అది సాధ్యం కాలేదు. పవన్ కళ్యాణ్ అనూహ్యంగా క్వారంటైన్లోకి వెళ్లిపోయారు. ఇక మిగిలింది చంద్రబాబు మాత్రమే. ప్రస్తుతం తిరుపతి ఉపఎన్నికలో ఓటర్లకు కనిపిస్తున్న ప్రధాన స్టార్ క్యాంపెయినర్ చంద్రబాబే. ఇలాంటి సమయంలో ఆయన వాహనంపై రాళ్ల దాడి తీవ్ర కలకలం రేపింది. దాడి ఎవరు చేశారన్నది పక్కనబెడితే చివరి మూడు రోజుల ప్రచారంలో ప్రధాన ఆకర్షణగా ఉన్న చంద్రబాబుపై రాళ్ల దాడికి దిగడం ద్వారా ఓటర్లకు వీరు ఏ సందేశం ఇవ్వదల్చుకున్నారన్నది ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.
తిరుపతిలో అసలు ముప్పు అదే
ప్రతిష్టాత్మకంగా మారిన తిరుపతి ఉపఎన్నిక ఫలితాల్ని తారుమారు చేసేందుకు పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నా.. రాజకీయ నేతలు వ్యూహాలకు పదును పెడుతున్నా.. వీరందరికీ కనిపించీ కనిపించని శత్రువు ఇప్పుడు కరోనా మాత్రమే. కరోనా కారణంగా రేపు ఉపఎన్నిక పోలింగ్లో పోలింగ్ బూత్లకు రావాల్సిన ఓటర్లు రాకుండా ఉండిపోతే మాత్రం ఫలితం కచ్చితంగా తారుమారు కాక తప్పదు. అన్నింటికీ మించి ఇక్కడ నమోదయ్యే పోలింగ్ శాతం ఫలితంపై కచ్చితంగా ప్రభావం చూపబోతోంది. దాదాపు 15 లక్షల ఓట్లున్న తిరుపతి లోక్సభ సీటులో కరోనాను తట్టుకుని పోలయ్యే ఓట్లెన్ని అన్న చర్చ ఇప్పుడు ఎక్కడ చూసిన సాగుతోంది. రేపు గెలుపోటములను అవే నిర్ణయించబోతున్నాయట.