తిరుపతిపై జగన్ ఏంచేస్తారు, బాబు సంబరాలకు షాక్!
హైదరాబాద్: చిత్తూరు జిల్లా తిరుపతి శాసనసభ నియోజకవర్గ ఎమ్మెల్యే వెంకటరమణ మృతి నేపథ్యంలో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఈ నేపథ్యంలో ఈసీ సంఘం దేశ వ్యాప్తంగా ఎన్నికల షెడ్యూల్స్ను సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తిరుపతి శాసన సభ నియోజకవర్గానికి ఫిబ్రవరి 13న ఎన్నికల నిర్వహించనున్నారు. 16న ఓట్లు లెక్కించాలని ప్రటించించింది.
వెంకటరమణ అనారోగ్య కారణాలతో మృతి చెందారు. దీంతో వెంకటరమణ సతీమణి సుగుణా వెంకటరమణకు టీడీపీ టిక్కెట్టు ఇచ్చి ఇతర పార్టీల సహకారంతో ఆమె ఎన్నికను ఏకగ్రీవం చేయాలన్న ఆలోచనలతో చంద్రబాబు ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఏకగ్రీవానికి ప్రతిపక్షాలు సహకరిస్తాయా? లేక పోటీకి సై అంటాయా? అన్న చర్చ జోరుగా సాగుతోంది.
దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డితో సన్నిహిత సంబంధాలు నెరిపిన వెంకటరమణ కుటుంబానికి అవసరమైనప్పుడు సహకరిస్తామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ అసెంబ్లీలో ప్రకటించారు. అయితే ఈ సహకారం వెంకటరమణ సతీమణి సుగుణ ఏకగ్రీవ ఎంపికకు దోహదపడుతుందని వెంకటరమణ వర్గీయులు గట్టిగా భావిస్తున్నారు.
వెంకటరమణ సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్లో కొనసాగిన నేపథ్యంలో ఆయనపై సానుభూతితో ఆ పార్టీ కూడా ఉప ఎన్నికల్లో పోటీ చేయకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్న వెంకటరమణకు నాలుగు పర్యాయాలు తాము టిక్కెట్టు ఇచ్చినా ఆయన చివరి నిమిషంలో ఆయన పార్టీని వీడినందున తాము ఎందుకు ఏకగ్రీవానికి సహకరించాలనే విషయాన్ని కొంతమంది నేతలు తమ వాదన లేనెత్తుతున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ అభ్యర్థిని బరిలోకి దిగినా గెలుపు అవకాశాలు తక్కువే కదా? అన్న ప్రశ్నకు గెలుపు ఓటములన్నది ప్రజల మనోభీష్టానికి సంబంధించినదని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిని బరిలోకి దింపడం భావ్యం కాదని టీడీపీ నేతలు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని బరిలోకి దింపితే జగన్ కూడా తమ అభ్యర్థిని బరిలోకి దింపే అవకాశాలు లేకపోలేదు.
బాబుకు ఎన్నికల కోడ్ దెబ్బ
తిరుపతి శాసనసభా స్థానానికి ఉప ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సింగపూర్ మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొనాల్సిన రాష్టస్థ్రాయి సంక్రాంతి సంబరాలు రద్దయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విధంగా సంక్రాంతి పండగను రాష్ట్ర పండగగా నిర్వహించాల్సి ఉంది. ఇందుకోసం తిరుపతిలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు.
మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ నేతృత్వంలో ఉన్నతస్థాయి బృందం గత కొన్ని రోజుల నుండి తిరుపతిలో మకాం వేసి ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ వచ్చారు. సంక్రాంతిని రాష్ట్ర పండగగా ప్రకటిస్తూ తిరుపతిలో ఏర్పాటు చేసే రాష్ట్ర స్థాయి కార్యక్రమానికి రూ.2కోట్లు, ఇతర 12 జిల్లాలకు రూ.కోటి చొప్పున కేటాయించారు.