Tirupati Stampede:తిరుపతి తొక్కిసలాట మృతులు వీళ్లే..
Tirupati Stampede: తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుపతిలో టోకెన్ల జారీ కౌంటర్ల వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కేంద్రమంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్, మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సహా పలువురు నాయకులు తమ సంతాపం తెలిపారు.
తిరుపతిలోని విష్ణునివాసం వద్ద బుధవారం రాత్రి ఈ దుర్ఘటన సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఆరుమంది దుర్మరణం పాలయ్యారు. వారిలో అయిదుమంది మహిళలు ఉన్నారు. 40 మంది వరకు గాయపడ్డారు. వాళ్లందరినీ శ్రీవేంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (స్విమ్స్), శ్రీవేంకటేశ్వర రామ్నారాయణ్ రూయా ఆసుపత్రులకు తరలించారు.

సంఘటన చోటు చేసుకున్న వెంటనే తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు కార్యనిర్వహణాధికారి సీహెచ్ వెంకయ్య చౌదరి హుటాహుటిన ఆయా ఆసుపత్రులకు వెళ్లారు. గాయపడ్డవారిని పరామర్శించారు. వారికి అందుతోన్న వైద్య చికిత్స గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.
ఈ తొక్కిసలాటలో మొత్తం ఆరు మంది మృతిచెందారు. అధికారులు వారిని గుర్తించారు. వారి వద్ద ఉన్న ఆధార్ కార్డు, ఇతర గుర్తింపు పత్రాల ఆధారంగా వారి వివరాలను సేకరించారు. మృతుల్లో ఇద్దరు పొరుగు రాష్ట్రాలకు చెందన వాళ్లుగా గుర్తించారు.
మృతుల్లో.. అనకాపల్లి జిల్లా నర్సీపట్నానికి చెందిన బీ నాయుడు బాబు (51), విశాఖపట్నానికి చెందిన రజిని (47), లావణ్య (40), శాంతి (34) ఉన్నారు. కర్ణాటకలోని బళ్లారికి చెందిన నిర్మల, తమిళనాడులోని సేలం ప్రాంతానికి చెందిన మల్లిక (49) ఈ తొక్కిసలాట ఘటనలో మృతి చెందారు. జిల్లా పోలీసు అధికారులు వాళ్ల కుటుంబాలకు సమాచారం ఇచ్చారు.












Click it and Unblock the Notifications