తొక్కిసలాటకు కారణం వెల్లడించిన టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు: ప్యూర్లీ యాక్సిడెంట్
Tirupati Stampede: తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుపతిలో టోకెన్ల జారీ కౌంటర్ల వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సహా పలువురు నాయకులు తమ సంతాపం తెలిపారు.
అధికారుల వల్ల..
తొక్కిసలాట పట్ల తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఛైర్మన్ బీఆర్ నాయుడు స్పందించారు. కొందరు అధికారుల వల్ల ఈ ఘటన చోటు చేసుకుందని అనుమానిస్తోన్నామని అన్నారు. టికెట్ల జారీ సెంటర్ వద్ద ఉన్న డీఎస్పీ గేట్లు తెరవడం, ఆ వెంటనే తోసుకుంటూ రావడం వల్ల ఈ ఘటన జరిగిందని, మొత్తం ఆరుమంది మరణించారని అన్నారు.

ఎక్స్గ్రేషియా ప్రకటిస్తారు..
ఈ ఘటన తరువాత ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుపతికి వస్తోన్నారని, గాయపడ్డవారిని పరామర్శిస్తారని, ఎక్స్గ్రేషియా ప్రకటిస్తారని బీఆర్ నాయుడు అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కఠినంగా ఆదేశించారని, చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చారని చెప్పారు.
ఇదొక పాఠంగా భావిస్తాం..
ఇదొక పాఠంగా భావిస్తామని, సమష్టిగా ఇలాంటివి జరగకుండా చూడాల్సిన బాధ్యత తమందరిపైనా ఉందని బీఆర్ నాయుడు పేర్కొన్నారు. వైకుంఠ ఏకాదశికి రెండు రోజుల ముందు ఈ ఘటన జరగడం అత్యంత దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సంఘటన జరిగిన తరువాత బాధిత కుటుంబాలకు సహాయం చేయడం తప్ప ఏమీ చేయలేమని వ్యాఖ్యానించారు.
మహిళ కొంత అనారోగ్యానికి..
ఒక్క కేంద్రంలో క్యూలైన్లో ఉన్న వాళ్లల్లో ఓ మహిళ కొంత అనారోగ్యానికి గురయ్యారని, ఆమెను ఆసుపత్రికి తరలించడానికి గేటు తీయాల్సి వచ్చిందని బీఆర్ నాయుడు అన్నారు. గేటు తీయడంతో జనం అంతా ఒక్కసారిగా వచ్చారని, దీనితో తొక్కిసలాట చోటు చేసుకుందని తెలిపారు.
టెలికాన్ఫరెన్స్లో మాట్లాడారు..
చంద్రబాబు, డీజీపీ, జిల్లా కలెక్టర్, ఎస్పీ.. స్థాయి అధికారులు టెలికాన్ఫరెన్స్లో మాట్లాడారని, అధికారుల మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పారు. అడ్మినిస్ట్రేషన్ ఇలా ఉండకూడదని, ఏర్పాట్లన్నీ పకడ్బందీగా జరగాలని చంద్రబాబు చెప్పారని పేర్కొన్నారు. లోపం క్లియర్గా కనిపిస్తోందని, దీన్ని చాలా తేలిగ్గా తీసుకున్నట్లు కనిపించిందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారని అన్నారు.
తిరుమలకు రావొద్దని ఎవరూ అన్లేదు..
గొడవలు జరుగుతాయనే అనుమానం తనకు ముందు నుంచీ ఉందని, తిరుమలకు రానివ్వరేమో, దర్శనం చేసుకోనివ్వరేమో అనే వదంతులు వ్యాపించాయని బీఆర్ నాయుడు అన్నారు. దాన్ని తాను తోసిపుచ్చానని, టోకెన్లు లేకపోతే దర్శనం ఉండదు తప్ప తిరుమలకు రావొద్దని ఎవరూ అన్లేదని చెప్పారు. ఇదొక ప్యూర్లీ యాక్సిడెంట్ అని అన్నారు.












Click it and Unblock the Notifications