రోజాకు చెక్: జగన్తో భేటీ, జగన్ పార్టీలోకి నటి రాశి?
హైదరాబాద్: వైయస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో తెలుగు సినిమా మాజీ హీరోయిన్ రాశి చేరుతారనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో కేవలం నటి రోజా మాత్రమే ఉన్నారు. ఆమెకు మించిన నటి ఆ పార్టీలో లేదని చెప్పొచ్చు.
ఈ పరిస్థితుల్లో జగన్ పార్టీలో రాశి చేరబోతున్నట్లు ప్రచారం సాగుతోంది. పలు చిత్రాల్లో అగ్రహీరోల సరసన రాశి నటించింది. ఇటీవల రాశి జగన్ని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో కలిశారు. అయితే తన కూతురు పుట్టిన రోజు సందర్భంగా జగన్ ఆశీర్వాదం కోసమే తన భర్తతో కలిసి పార్టీ కార్యాలయానికి వచ్చినట్టు రాశి చెప్పారు.
అయితే, పార్టీలో చేరే ఉద్దేశంతోనే ఆమె జగన్ను కలిసినట్లు చెబుతున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో వాసిరెడ్డి పద్మ వంటి మహిళా నాయకులు ఉన్నారు. అయితే, గ్లామర్ విషయంలో మాత్రం రోజా తప్ప మరొకరు లేరు.
అందుకే సినీ గ్లామర్ని పార్టీకి జోడించాలని జోడించాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో రాశిని పార్టీలోకి ఆహ్వానించారని, అయితే ఆమె ఎప్పుడు పార్టీలోకి వస్తారనేది ఇంకా తేలలేదని అంటున్నారు. రాశి ప్రవేశంతో రోజా ప్రాబల్యం తగ్గుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.