వైఎస్ఆర్ సీపీలో చేరిన దాసరి అరుణ్! కర్నూలు జిల్లా టీడీపీ నేత కూడా చేరిక!
హైదరాబాద్: తెలుగు చిత్ర పరిశ్రమ దిగ్గజ దర్శకుల్లో ఒకరు, కేంద్ర మాజీమంత్రి, దివంగత దాసరి నారాయణరావు కుమారుడు, నటుడు అరుణ్ కుమార్ రాజకీయాల్లో అడుగు పెట్టారు. కొన్నాళ్లుగా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరునిగా ఉంటూ వచ్చిన ఆయన అధికారికంగా ఆ పార్టీలో చేరారు. గురువారం మధ్యాహ్నం హైదరాబాద్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలుసుకున్నారు. తాను పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా వైఎస్ జగన్.. ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. జగన్ పాదయాత్ర సమయంలోనే అరుణ్ వైఎస్ఆర్ సీపీలో చేరే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. వైఎస్ జగన్ పాదయాత్ర ఆరంభించినప్పటి నుంచీ అరుణ్ పార్టీ సానుభూతిపరునిగా ఉంటూ వచ్చారు. ఇదివరకు దాసరి నారాయణ రావు కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యునిగా కొనసాగారు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కేబినెట్ లో బొగ్గు శాఖ సహాయమంత్రిగా పనిచేశారు.
రాప్తాడు టిడిపి లో ట్విస్ట్: సునీత స్థానంలో శ్రీరాం...పోటీగా మంత్రులు : సీయం అంగీకరించేనా..!
లబ్బి వెంకటస్వామి కూడా..
కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి కూడా గురువారం వైఎస్ఆర్ సీపీలో చేరారు. వైఎస్ జగన్ ఆయనకు పార్టీ కండువా కప్పి, సాదరంగా ఆహ్వానించారు. అంతకుముందు ఆయన కాంగ్రెస్ లో చాలాకాలం పాటు కొనసాగారు. 2009 ఎన్నికల్లో లబ్బి వెంకటస్వామి కర్నూలు జిల్లాలోని నందికొట్కూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఘన విజయం సాధించారు. రాష్ట్ర విభజన తరువాత ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. తాజాగా- వైఎస్ఆర్ సీపీ తీర్థం పుచ్చుకున్నారు.