సీఎం జగన్ను కొనియాడిన ఆర్.నారాయణమూర్తి... ఆ విషయంలో రుణపడి ఉంటానని కామెంట్...
తూర్పుగోదావరి జిల్లాలోని ఏలేరు, విశాఖ జిల్లాలోని తాండవ జలాశయాల కింద ఉన్న కాలువల అనుసంధాన ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై సినీ దర్శకుడు ఆర్.నారాయణమూర్తి హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేయడం ద్వారా రైతుల్లో జగన్ సంతోషం నింపారని కొనియాడారు. గత కాంగ్రెస్,టీడీపీ ప్రభుత్వాలు తూర్పు గోదావరి,విశాఖ జిల్లాల్లోని మెట్ట ప్రాంతాలను నిర్లక్ష్యం చేశాయని అన్నారు. గోదావరి నది ప్రవహించే తూర్పుగోదావరి జిల్లాలో 52 శాతం మెట్ట ప్రాంతమేనని అన్నారు. ఏలేరు-తాండవ అనుసంధాన పనులతో ఇప్పుడా ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు జగన్ పూనుకోవడం అభినందనీయం అన్నారు.
ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ప్రతిపాదనలతో ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వ ఆమోదం లభించిందని ఆర్.నారాయణమూర్తి పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టును నిర్మించ తలపెట్టినందుకు ఆ ప్రాంతాల ప్రజలతో పాటు తానూ సీఎం జగన్కు రుణపడి ఉంటానని చెప్పారు. ప్రాజెక్టుకు నిధుల మంజూరులో సహకరించిన మంత్రులు అనిల్ యాదవ్, కన్నబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.

ఏలేరు-తాండవ జలాశయాల కింద ఉన్న కాలువ అనుసంధాన పనులకు గత వారం ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందుకోసం రూ.470.05 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ కాలువల అనుసంధానంతో కొత్తగా 5,600 ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుందని.. 51,465 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుందని అంచనా వేస్తున్నారు.
Recommended Video
విశాఖ జిల్లాలోని తాండవ నదిపై గతంలో జలాశయాన్ని నిర్మించారు. దీని సామర్థ్యం 4.96టీఎంసీలు. ఇక్కడినుంచి తూర్పు గోదావరి,విశాఖ జిల్లాలకు సాగునీరు అందేలా కాలువలు నిర్మించారు. అయితే ఈ నదిలో చాలినంత నీరు లేక.. ప్రతీ ఏటా సాగుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.దీంతో తాండవ జలాశయం కింద కాలువలను ఏలేరు జలాశయం కాలువలతో అనుసంధానిస్తే సమస్య పరిష్కారమవుతుందని అధికారులు నిర్ణయించారు. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అందుకు ఆమోదం తెలిపారు.












Click it and Unblock the Notifications