ఏపీ వర్షాల బాధితులకు టాలీవుడ్ సాయం-చిరంజీవి, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ విరాళాలు
ఏపీలో తాజాగా కురిసిన భారీ వర్షాలు, వాటి వల్ల వచ్చిన వరదలకు రాయలసీమలోని నాలుగు జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. వందలఎకరాల పంటనష్టంతో పాటు వ్యక్తిగతంగా కూడా ఆస్తుల నష్టం కలిగింది. దీంతో వరద బాధితులకు టాలీవుడ్ హీరోలు ఇవాళ వరుసగా సాయం ప్రకటించారు.
ఏపీలో వర్షాలు, వరద బీభత్సానికి నష్టపోయిన బాధితులకు మెగాస్టార్ చిరంజీవి అండగా నిలిచారు. బాధితులను ఆదుకునేందుకు తనవంతు సాయంగా 25 లక్షల రూపాయలను ఏపీ ప్రభుత్వ సహయనిధికి విరాళంగా ప్రకటించారు. అనంతరం చిరంజీవి బాటలోనే ఆయన తనయుడు రామ్ చరణ్ కూడా బాధితులను ఆదుకునేందుకు తన వంతు సాయంగా 25 లక్షల రూపాయలను ఏపీ ప్రభుత్వ సహాయ నిధికి విరాళంగా ప్రకటించారు. చిరంజీవి, రామ్ చరణ్ ల నుండి ఏపీ ప్రభుత్వ సహాయ నిధి కి మొత్తం 50 లక్షల రూపాయలు విరాళం అందినట్లయింది. ఏ విపత్తు వచ్చినా బాధితులకు అండగా ఉండేందుకు మెగా ఫ్యామిలీ ముందు ఉంటుందనేది మరోసారి నిరూపించారని అభిమానులు చెప్తున్నారు.
ఇదే క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా వరద బాధితుల్ని ఆదుకునేందుకు ముందుకొచ్చారు. ఆయన కూడా బాధితులకు రూ.25 లక్షల సాయం ప్రకటించారు. బాధితులు వరద ముప్పు నుంచి త్వరగా కోలుకోవాలని ఎన్టీఆర్ ఆకాంక్షించారు. ఇప్పటివరకూ వరద బాధితులకు ప్రభుత్వంతో పాటు స్వచ్ఛందసంస్దలు, ఎన్నారైలు మాత్రమే సాయం చేస్తుండగా.. టాలీవుడ్ హీరోల నుంచి వచ్చిన విరాళాల ప్రకటనలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇదే కోవలో త్వరలో మరికొందరు టాలీవుడ్ హీరోలతో పాటు ప్రముఖులు కూడా విరాళాలు ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో వరద బాధితులకు ప్రభుత్వ సాయంతో పాటు టాలీవుడ్ సాయం కూడా అందినట్లయింది.
Recommended Video
గతంలోనూ వరదలతో పాటు జాతీయ విపత్తులు తలెత్తినప్పుడు టాలీవుడ్ పలువురు బాధితులకు సాయం అందించింది. కానీ ఈసారి మాత్రం ఇంకా స్పందించడం లేదని విమర్శలు వస్తున్న నేపథ్యంలో చిరంజీవి, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ముందుకొచ్చారు. దీంతో టాలీవుడ్ లో మరికొందరికి వీరు స్ఫూర్తిగా నిలిచారని ప్రశంసలు అందుకుంటున్నారు.