‘నయీమ్తో అచ్చెన్నాయుడికి సంబంధాలు: సినీ నిర్మాతలతో కూడా’
హైదరాబాద్: గ్యాంగ్స్టర్ నయీమ్ ఎన్కౌంటర్ అయిన నాటి నుంచి అతని నేర సామ్రాజ్యానికి సంబంధించిన అనేక విషయాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. అతనికి ప్రముఖులతో సంబంధాలున్నట్లు కూడా ఆరోపణలు కూడా వస్తున్నాయి. తాజాగా టాలీవుడ్ సినీ నిర్మాత నట్టి కుమార్ సంచలన ఆరోపణలు చేశారు.
ఉమ్మడి రాష్ట్రంలో గ్యాంగ్స్టర్ నయీమ్ను పెంచి పోషించింది తెలుగుదేశం ప్రభుత్వమేననీ, అతడి దుర్మార్గాలకు పలువురు టీడీపీ నాయకులు అండగా నిలిచారని సినీ నిర్మాత నట్టికుమార్ ఆరోపించారు. అంతేగాక, తెలుగుదేశం నేత, ఆంధ్రప్రదేశ్ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడుకి నయీమ్ గ్యాంగ్తో సత్సం బంధాలున్నాయని అన్నారు.
సోమవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నట్టికుమార్ మాట్లాడుతూ.. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటలోని ఓ పవర్ప్లాంట్కు సంబంధించి నయీమ్తో అచ్చెన్నాయుడు చేతులు కలిపారన్నారు. కావాలంటే సీబీఐతో దర్యాప్తు చేయిస్తే.. నిజానిజాలు వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు.
'నర్సన్నపేటలోని నా థియేటర్ వెంకటేశ్వరా మహల్ను నయీమ్ అనుచరులు అజీజ్, అంజిరెడ్డిలు అక్రమంగా లాక్కున్నారు. ఓ స్థలం వివాదంలో రెండు నెలల క్రితం నయీమ్ గ్యాంగ్ నన్ను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారని నా మిత్రుడితోపాటు ఓ ఎమ్మెల్యే ద్వారా సమాచారం అందింది. దీంతో అలర్ట్ అయ్యాను. నన్ను నేను కాపాడుకోగలిగాను' అని వెల్లడించారు.
'ఓ రోజు విమానంలో కలిసిన అచ్చెన్నాయుడితో ఈ విషయాలు చెప్పినా ప్రయోజనం లేకుండా పోయింది. నయీమ్తోనే సెటిల్ చేసుకోమన్నారు. నయీమ్ అండతో ఉత్తరాంధ్రలో అచ్చెన్నాయుడు ప్రత్యేక పాలన కొనసాగించారు. మొన్నటివరకూ విశాఖ ఏసీపీగా పనిచేసిన రమణమూర్తి, నర్సన్నపేట సీఐ చంద్రశేఖర్, డీఎస్పీ, ఎస్పీల దగ్గరకు వెళ్లాను. న్యాయం చేయమని కోరాను. ఏం చేయలేమన్నారు. రివర్స్లో సీఐ చంద్రశేఖర్ నన్నే బెదిరించారు' అని నట్టికుమార్ తెలపడం గమనార్హం.
టాలీవుడ్ పరిశ్రమతో సంబంధాలు: బెదిరింపులు
విజయవాడ నుంచి ఉత్తరాంధ్ర వరకూ ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న థియేటర్లన్నీ నయీమ్ డబ్బుతోనే కడుతున్నారని నట్టికుమార్ తెలిపారు. నయీమ్ అనుచరుడు జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో ఈ థియేటర్ల దందా నడుస్తోందని తెలిపారు. అక్కడ థియేటర్లన్నిటిలో జగ్గిరెడ్డి క్యాంటీన్లను నిర్వహిస్తున్నారని, ప్రతిరోజూ కనీసం రూ.5 కోట్ల వ్యాపారం జరుగుతోందని వెల్లడించారు. అందులో ఒక్క రూపాయికి కూడా లెక్కలు ఉండవని చెప్పారు.
టాలీవుడ్ నిర్మాతలు సి కళ్యాణ్, అశోక్కుమార్, బూరుగుపల్లి శివరామకృష్ణ, తెలుగులో కొన్ని చిత్రాలు చేసిన బాలీవుడ్ నటుడు-నిర్మాత సచిన్ జోషిలతోనూ నయీమ్కు సంబంధాలున్నాయని ఆరోపించారు. సచిన్ జోషి డబ్బుతో బండ్ల గణేశ్ సినిమాలు నిర్మించారు. తర్వాత డబ్బులు తిరిగి ఇవ్వకపోతే నయీమ్ మనుషులతో వసూలు చేసేందుకు సచిన్ జోషి ప్రయత్నించారని తెలిపారు. ఆ తర్వాత ఏం జరిగిందో తనకు తెలియదని చెప్పారు.
అంతేగాక, నయీమ్ అండతోనే విశాఖలో కోట్లాది రూపాయలు విలువ చేసే భూములను అశోక్కుమార్ సంపాదించారని వెల్లడించారు. మల్కాజిగిరి ఎమ్మెల్యే కనకారెడ్డికి అల్వాల్లో ఓ గెస్ట్హౌస్ ఉందని, ఆయుధాలతో సహా నయీమ్ అనుచరులు అందులో ఉన్నారని, నయీమ్ ఒక్కడే మరణించాడని తెలిపారు.
ఇంకా, నయీమ్ అనుచరులు, సైన్యం మరణించలేదని నట్టికుమార్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం నయీమ్ గ్యాంగ్పై కఠిన చర్యలు తీసుకోవడం అభినందనీయమన్నారు. సిట్పై తనకు నమ్మకం ఉందని చెప్పారు. నయీమ్ ఆగడాలపై ఏపీ సీఎం చంద్రబాబు నిజాయితీగా విచారణ జరిపించాలన్నారు. కాగా, నయీమ్ నేర సామ్రాజ్యంపై సిట్ దర్యాప్తు జరుపుతున్న విషయం తెలిసిందే. నయీమ్కు సంబంధించిన వేల కోట్ల ఆస్తులతోపాటు అతని నేరాలకు సంబంధించిన వివరాలను సేకరిస్తోంది.