చంద్రబాబు అధ్యక్షతన రేపు టీడీఎఎల్పీ భేటీ: అసెంబ్లీ సమావేశాలపై మార్గనిర్దేశం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రేపు (సోమవారం) తెలుగుదేశం శాసనసభ పక్ష సమావేశం జరగనుంది. అసెంబ్లీ భవనంలోని కమిటీ హాల్లో మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు టీడీఎల్పీ భేటీ కానుంది.
అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. ప్రభుత్వ పరంగా శాంతి భద్రతలు, మద్యం కుంభకోణం, ఆర్ధిక పరిస్థితిపై మూడు శ్వేతపత్రాలు సభలో పెట్టి చర్చించనుండటంతో ఆయా అంశాలపై ఎమ్మెల్యేలు పట్టు పెంచుకునేలా సూచనలు ఇవ్వనున్నారు.

ప్రతిపక్షం లేనందున స్వపక్షమే ప్రజా సమస్యలు సభలో లేవనెత్తి పరిష్కారం చూపేలా పలువురికి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
జగన్ ఆరోపణలను తిప్పికొట్టాలి: చంద్రబాబు
రాష్ట్రంలో ఎన్డీయే అధికారంలోకి వచ్చాక 36 మందిని హత్య చేశారంటూ జగన్ తప్పుడు ప్రచారం చేస్తుంటే.. మంత్రులు, తెలుగుదేశం నాయకులు గట్టిగా తిప్పికొట్టకపోవడంపై చంద్రబాబు నాయుడు అసహనం వ్యక్తం చేశారు. ఆ 36 మంది పేర్లు, వివరాలు బైటపెట్టాలని గట్టిగా ఎందుకు నిలదీయడం లేదని మంత్రులు, ఎంపీలను ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల విషయంలో రాజీలేదని, పోలీసులు కఠినంగా వ్యవహరించాలని తేల్చి చెప్పారు.
తెలుగుదేశం కార్యకర్తలు తప్పు చేసినా ఉపేక్షించొద్దని స్పష్టం చేశారు. హోం మంత్రి అనిత మరింత చురుగ్గా పనిచేయాలని, వైసీపీ తప్పుడు ప్రచారాన్ని వెంటనే తిప్పికొట్టాలని ఆయన ఆదేశించారు. పోలీసు అధికారులు వెంటనే స్పందించకపోతే సస్పెండ్ చేయడానికైనా వెనుకాడొద్దని చంద్రబాబు అన్నారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో గంజాయి, డ్రగ్స్, నకిలీ మద్యంపై అదుపు లేకపోవడం వల్ల రాష్ట్రంలో నేరాల రేటు పెరిగిందని తెలిపారు. త్వరలోనే పూర్తిగా నియంత్రిస్తామని స్పష్టంచేశారు.
తెలుగుదేశం హయాంలో శాంతిభద్రతల నిర్వహణ అత్యుత్తమంగా ఉంటుందన్న పేరుందని గుర్తుచేశారు. దాన్ని దెబ్బతీయడానికి ఎవరు ప్రయత్నించినా సహించనని తేల్చిచెప్పారు. మత ఘర్షణలు, ఫ్యాక్షన్, నక్సలిజం, రౌడీయిజాన్ని నియంత్రించిన చరిత్ర తెలుగుదేశం ప్రభుత్వానిదన్నారు. తమపై తప్పుడు ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్మరన్నారు.
ఎవరు హింసాకాండకు పాల్పడ్డా ఉక్కుపాదంతో అణచివేస్తామని, శాంతి భద్రతల్ని కాపాడడంలో రాజీ పడబోమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. శాంతి భద్రతల్ని స్వయంగా తానే పర్యవేక్షిస్తానని తెలిపారు. ప్రజలు పూర్తిగా తిరస్కరించినా పులివెందుల ఎమ్మెల్యే జగన్ ప్రవర్తనలో మార్పు రాలేదని, ఉనికి చాటుకోవడానికే హత్యా రాజకీయాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications