జనసేన తరఫున ఎమ్మెల్యే, ఎంపీలుగా పోటీ చేసేందుకు రైతులు, ఐటీ ఇంజినీర్ల ఉత్సాహం
అమరావతి: జనసేన వైపు అన్ని పార్టీలు చూస్తున్నాయని, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ నుంచి బరిలోకి దిగడానికి వివిధ వర్గాలు, విద్యావంతులు ఉత్సాహం చూపారని ఆ పార్టీ శుక్రవారం తెలిపింది. టిక్కెట్ కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో 80 శాతం మంది 50 సంవత్సరాలలోపు వయస్సులోని వారేనని పేర్కొన్నారు.
రాజకీయాలలోకి కొత్తతరం రావాలన్న పవన్ కళ్యాణ్ సంకల్పానికి అనూహ్య స్పందన లభించిందని జనసేన పేర్కొంది. జనసేన తరఫున ఎన్నికల బరిలో నిలుస్తామని ధృడమైన ఆకాంక్షను వ్యక్తం చేస్తూ 2410 మంది బయోడేటాలు ఇచ్చారని, ఇందులో ఎక్కువ శాతం మంది అభ్యర్థులు కొత్తవారేనని చెప్పారు. అయితే అందులో రాజకీయ ఉద్దండులను సైతం ఢీకొట్టగల వారు గణనీయంగా ఉన్నారని, దరఖాస్తులు సమర్పించిన వారిలో 80 శాతం మంది 50 సంవత్సరాలలోపు వయస్సు ఉన్నవారు కావడం గమనార్హమని చెప్పారు.
అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు వేలాదిగా దరఖాస్తులు
ఫిబ్రవరి 13వ తేదీ నుంచి 25వ తేదీ వరకు బయోడేటాల స్వీకరణ ప్రక్రియ విజయవాడ నగరంలో జరిగిందని చెప్పారు. శాసన సభ ఎన్నికల కోసం 2087, పార్లమెంటు కోసం 323 బయోడేటాలు వచ్చాయని చెప్పారు. రాజకీయాల్లోకి మేధావులు, విద్యావంతులు, యువతీ యువకులు రావాలని లేదంటే మన రాజకీయ వ్యవస్థ దోపిడీదారులతో నిండిపోతుందని పవన్ అభిప్రాయమని చెప్పారు. ప్రస్తుతం అందిన బయోడేటాలు చూస్తుంటే పవన్ పిలుపుకి ఘనమైన స్పందన లభించినట్లుగా అర్థమైందన్నారు.
బరిలో ఐటీ ఇంజినీర్లు, రైతులు
570 మంది మహిళలు పోటీ చేసేందుకు ముందుకు వచ్చారని, 140 మంది న్యాయవాదులు, 113 మంది ఐటీ, ఇంజినీర్లు, 65 మంది డాక్టర్లు, 41 మంది లెక్చరర్లు, 29 మంది జర్నలిస్టులు, 22మంది ప్రొఫెసర్లు, 10మంది సైనికులు, 8మంది చార్టెడ్ అకౌంటెంట్లు, ఐఏఎస్లు, ఐపీఎస్ కేడర్లో పని చేసిన వారు ఉన్నారని జనసేన తెలిపింది. ఇద్దరు న్యాయమూర్తులుగా సేవలు అందించారని, పోలీస్, ప్రభుత్వ సర్వీసులలో ఉన్నవారు ఇలా అనేక రంగాలకు చెందిన వారు జనసేన తరఫున పోటీ చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేశారన్నారు.
బయోడేటాలు
అంతేకాకుండా, ఎస్సీ, ఎస్టీ రిజర్వ్డ్ సెగ్మెంట్ల నుంచి పోటీ చేయడానికి ఉన్నత విద్యావంతులు, ఆడపడుచులు ముందుకు రావడం జనసేన పార్టీ పట్ల ఆ వర్గాలలో నెలకొన్న నమ్మకాన్ని తెలియజేస్తోందని పేర్కొంది. 659 మంది వ్యాపారవేత్తలు, 169 మంది రైతులు, కూడా జనసేన తరఫున పోటీకి బయోడేటాలు ఇచ్చారని చెప్పారు. 945 మంది గ్రాడ్యుయేట్లు, 720 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు, 30 మంది పీహెచ్డీ పట్టభద్రులు దరఖాస్తు చేసిన వారిలో ఉన్నారని చెప్పారు.
తుది జాబితా పవన్ కళ్యాణ్కు
అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లా నుంచి 275, ఆ తర్వాత కృష్ణా నుంచి 256, గుంటూరు జిల్లా నుంచి 243 బయోడేటాలు అందినట్లు జనసేన తెలిపింది. అదేవిధంగా అత్యధికంగా విజయవాడ ఈస్ట్ నుంచి 42, పిఠాపురం, గుంటూరు ఈస్ట్ నుంచి 29 చొప్పున బయోటేడాలు వచ్చాయి. దెందూలురు నుంచి పోటీ చేసేందుకు ట్రాన్స్ జెండర్ బయోడేటా సమర్పించినట్లు తెలిపారు. అందిన బయోడేటాలను స్క్రీనింగ్ కమిటీ పూర్తిగా అధ్యయనం చేశాక అర్హుల జాబితాను పార్టీ జనరల్ బాడీ ముందు ఉంచనుందని, స్క్రీనింగ్ కమిటీ అధ్యయనం ప్రారంభమైందని, అభ్యర్థుల సామర్థ్యంపై జనరల్ బాడీ అంచనా జరిపించి తుది జాబితాను పవన్కు సమర్పించనుంది.
ఆయా రంగాల నుంచి
జనసేన తరఫున పోటీ చేసేందుకు ఆయా రంగాల నుంచి బయోడేటాలు సమర్పించిన వారిలో.. వ్యాపారరంగం నుంచి 659, వ్యవసాయదారులు169, లాయర్లు 140, ఐటీ ఉద్యోగులు 113, ఉపాధ్యాయులు 64, వైద్యులు 65, అధ్యాపకులు 41, మీడియా ప్రతినిధులు 29, ఆచార్యులు 22, రక్షక భటులు 12, ఇంజినీర్లు 13, వాణిజ్య గణిత నిపుణులు 8, విశ్రాంత సైనికులు 10, పోలీస్ ఉన్నతాధికారులు 1, న్యాయమూర్తులు 1, పౌర సంబంధ అధికారులు 3.. మొత్తం 1060 మంది బయోడేటాలు ఇచ్చారు. అలాగే, పట్టభద్రులు 945, ఉన్నతపట్టభద్రులు 720, పరిశోధకులు 30, వాణిజ్య గణిత నిపుణులు 8, ఇతరులు 707 మంది దరఖాస్తు చేశారని జనసేన తెలిపింది. వయస్సు వారీగా చూస్తే 30 ఏళ్లలోపు 595 మంది, 31-40 మంది 839, 41-50 ఏళ్ల మధ్య 600, 51-60 మధ్య 275, 60 ఏళ్లకు పైబడిన వారు 101 మంది దరఖాస్తు చేసుకున్నారు. మహిళలు 570 మంది, పురుషులు 1839 మంది, ట్రాన్స్ జెండర్ ఒకరు దరఖాస్తు ఇచ్చినట్లు తెలిపారు.