TDP 'పెద్దాయన'... YCP 'పెద్దాయన'... హోరాహోరీ!?
వచ్చే ఎన్నికల్లో గెలుపే ప్రధాన లక్ష్యంగా అధికార వైఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం హోరాహోరీగా తలపడుతున్నాయి. ఏ పార్టీ బలం ఎక్కడ? ఏ పార్టీ బలహీనత ఎక్కడ? బలాన్ని తగ్గించడానికి ఏం చేయాలి? బలహీనతను అధిగమించాలంటే ఎటువంటి చర్యలు చేపట్టాలి? తదితర అంశాలతో ఈ రెండు పార్టీలు వ్యూహాలు రూపొందించుకొని ఒకరిపై మరొకరు పైచేయి సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

రాయలసీమే అధికారం కట్టబెట్టింది..
వైసీపీ అధికారంలోకి రావడానికి ప్రధానంగా ఉపయోగపడింది రాయలసీమ కావడంతో చంద్రబాబునాయుడు దానిపై ప్రత్యేక దృష్టిసారించారు. మొత్తం 52 అసెంబ్లీ నియోజకవర్గాలకు గత ఎన్నికల్లో కేవలం టీడీపీ 3 నియోజకవర్గాల్లోనే గెలుపొందింది. కుప్పం, హిందూపురం, ఉరవకొండలో మాత్రమే పసుపు జెండా రెపరెపలాడింది. తెలుగుదేశం పార్టీ పరాజయంలో రాయలసీమ కీలకపాత్ర పోషించింది అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఈసారి ఎన్నికల్లో అటువంటి పరిస్థితి ఎదురవకుండా ఉండేందుకు చంద్రబాబు ఇప్పటినుంచే ప్రణాళికలు రచిస్తున్నారు.

టీడీపీ నేతల్లో పెరిగిన ఆత్మవిశ్వాసం
రాయలసీమలో వైసీపీని నియంత్రిస్తే సులువుగా అధికారం క్కుతుందనే భావనలో ఉన్నారు. అందుకనుగుణంగా ఆయన రాయలసీమలో బాదుడే బాదుడతోపాటు ఇదేం ఖర్మ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రజల నుంచి అనూహ్య స్పందన వ్యక్తం కావడంతో పార్టీలో ఆత్మవిశ్వాసం పెరిగింది. పార్టీ ఇన్ ఛార్జిలకు, సీనియర్ నేతలకు నిత్యం ప్రజల్లోనే ఉండేలా కార్యక్రమాలు రూపొందించుకోవాలని చంద్రబాబు రూట్ మ్యాప్ ఇచ్చారు. దీంతో రాయలసీమలో తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులంతా ప్రజలతో మమేకమవడానికి, రానున్న ఎన్నికల్లో విజయం సాధించడానికి ప్రయత్నాలు ప్రారంభించారు.

అప్రమత్తమైన ముఖ్యమంత్రి జగన్
చంద్రబాబు రోడ్ షోలకు జనం పోటెత్తడంలాంటి చర్యలు గమనించిన ముఖ్యమంత్రి జగన్ వెంటనే అప్రమత్తమయ్యారు. కర్నూలులో సీమగర్జనకు మద్దతు ప్రకటించారు. ఈ సభలో చంద్రబాబును దోషిగా నిలబటట్టే ప్రయత్నం చేశామని, అది విజయవంతమైందని వైసీపీ నాయకులంటున్నారు. రాయలసీమపై పట్టుపోకుండా ఉండేందుకు తాజాగా జగన్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని రంగంలోకి దింపారు. ఆయన ఇప్పటికే చిత్తూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో సమావేశాలు ఏర్పాటు చేశారు. తాజాగా అనంతపురం జిల్లాలోని నియోజకవర్గాల్లో కూడా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడెక్కడ పార్టీ బలహీనంగా ఉందో గుర్తించి జగన్ కు నివేదిక అందజేస్తున్నారు.

పావులు కదుపుతున్న మంత్రి పెద్దిరెడ్డి
పీలేరు మాజీ ఎమ్మెల్యే వైసీపీలో చేరేలా పెద్దిరెడ్డి పావులు కదిపారు. ఎంపీ మిథున్ రెడ్డి, ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, కడప ఎంపీ అవినాష్ రెడ్డి నిత్యం సమావేశాలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా వివిధ నియోజకవర్గాల్లో విస్త్రతంగా పర్యటిస్తున్నారు. కీలకమైన వైసీపీ నాయకులు మైండ్ గేమ్ ఆడుతుండటంతో టీడీపీ నాయకులు డైలామలో పడుతున్నారు. ఇలా ఒకరికొకరు పై చేయి సాధించేందుకు హోరాహోరీగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. చివరకు రాయలసీమ ఎవరిని వరిస్తుందో వారికే రాష్ట్రంలో అధికారం దక్కుతుంది. ఆ వరమాల కోసం రెండు పార్టీల నేతలు ఏడాదిన్నర ముందునుంచే ఒకర్నొకరు ఢీకొడుతున్నారు.












Click it and Unblock the Notifications