అటు అఖండ..ఇటు జూ ఎన్టీఆర్ : కాబోయే సీఎం - ఫ్యాన్స్ హంగామా: టీడీపీ నేతల వ్యాఖ్యలపైనా...!!
ఏపీలో కొత్త నినాదాలు వినిపిస్తున్నాయి. నందమూరి అభిమానులు అటు అఖండ జాతరలో మునిగిపోయారు. ఇటు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. ఏపీలో మూవీ టిక్కెట్ల రేట్లు పైన వివాదం కొనసాగతున్న సమయంలో సినిమా - పొలిటికల్ సర్కిల్స్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కరోనా కారణంగా ప్రేక్షకులు థియేటర్లకు రావటం తగ్గిపోయింది. ఇక, ఏపీ ప్రభుత్వం ఆన్ లైన్ టిక్కెట్ల పేరుతో గతంలో ఉన్నట్లుగా పెద్ద సినిమాల ధరలు పెంచుకోవటానికి అవకాశం లేకుండా చేసింది.
అటు బాలయ్య ..ఇటు జూ ఎన్టీఆర్
బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వలేదు. బెనిఫిట్ షో లు ప్రదర్శించారనే కారణంతో రెండు థియేటర్ల పైన చర్యలు కూడా తీసుకున్నారు. ఇక, ఇప్పుడు ఇదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తమ హీరో మూవీలలోనే కాదు..రాజకీయంగానూ రాణిస్తారంటూ 'జై ఎన్టీఆర్...కాబోయే సీఎం ఎన్టీఆర్'' అంటూ పెద్ద ఎత్తున నినాదాలతో హోరెత్తించారు. బెజవాడ నడి బొడ్డున జూనియర్ ఫ్యాన్స్ చేసిన హంగామా ఇప్పుడు టీడీపీలో హాట్ టాపిక్ గా మారింది. 2019 లో టీడీపీ ఓడిన తరువాత కింది స్థాయి కార్యకర్తల్లో జూనియర్ ఎన్టీఆర్ ను తిరిగి పార్టీలో యాక్టివ్ చేయాలనే నినాదం బలంగా వినిపిస్తున్నారు.
జై ఎన్టీఆర్...కాబోయే సీఎం ఎన్టీఆర్
చంద్రబాబు కుప్పం పర్యటన..మచిలీపట్నం లోనూ ఆయన ముందే జూనియర్ ఎన్టీఆర్ జెండాలతో హంగామా చేసారు. ఇదంతా గమనించినా..చంద్రబాబు మాత్రం ఎక్కడా రియాక్ట్ కాలేదు. ఇక, కొద్ది రోజుల క్రితం అసెంబ్లీలో జరిగిన పరిణామాలు..చంద్రబాబు కన్నీరు పెట్టటం పైన టీడీపీ శ్రేణుల నుంచి జూనియర్ ఎన్టీఆర్ స్పందించాలంటూ ఒత్తిడి వచ్చింది. ఆయన వీడియో సందేశం విడుదల చేసారు. అందులో చంద్రబాబు - భువనేశ్వరి పేర్లతో సహా పార్టీలు - వంశీ..కొడాలి నాని పేర్లు ప్రస్తావించటకపోవటం పైన టీడీపీ నేతలు ఓపెన్ గానే వ్యాఖ్యలు చేసారు.
టీడీపీ నేతలు వ్యాఖ్యలు చేసిన చోట నుంచే
సింహాద్రి.. ఆది లాగా మాట్లాడుతాడనుకుంటే ప్రవచనాలు చెప్పారంటూ టీడీపీ నేతలు వర్ల రామయ్య..బుద్దా వెంకన్న వ్యాఖ్యానించారు. ఇప్పుడు అదే గడ్డ నుంచి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ నినాదాలు చేసారు. విజయవాడలో ఆర్ఆర్ఆర్ మూవీ ట్రైలర్ ప్రివ్యూను చూసేందుకు వచ్చిన అభిమానులు ఈ నినాదలతో మోత పుట్టించారు. జూనియర్ ఎన్టీఆర్ కట్ ఔట్కి కొబ్బరి కాయలు కొట్టి, పాలాభిషేకం చేశారు. కేక్ కట్ చేసి అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. అభిమానులు తాకిడి తట్టుకోలేక సిబ్బంది థియేటర గేట్లు వేశారు. అయినప్పటికీ అభిమానులు గేట్లు దూకి లోపలకు వెళ్లారు.
జూనియర్ ఫ్యాన్స్ నినాదాల వెనుక
జూనియర్ ఎన్టీఆర్పై కొంత మంది రాజకీయ నాయకులు చేసిన వ్యాఖ్యలు పై ఎన్టీఆర్ అవసరమైనప్పుడు స్పందిస్తారంటూ అభిమానులన నినాదాలు చేసారు. ఇక, కొడాలి నాని.. వల్లభనేని వంశీ సైతం తాము జూనియర్ ఎన్టీఆర్ తో గతంలో సన్నిహితంగా ఉన్నా..ఇప్పుడు జగన తో ఉన్నామని తేల్చి చెప్పారు. ఆ తరువాత వంశీ క్షమాపణతో వివాదం సర్దుమణిగింది. అయితే, రెండు పార్టీల నేతల వ్యాఖ్యల పైనా జూనియర్ ఎన్టీఆర్ స్పందించలేదు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గురించి అభిమానులు చేస్తున్న రాజకీయ నినాదాలే టీడీపీలో హాట్ పుట్టిస్తున్నాయి. ఈ మొత్తం పరిణామాల పైన జూనియర్ ఎప్పుడు స్పందిస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.