విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి ప్రజలకు ముఖ్య గమనిక
విజయవాడ డివిజన్ పరిధిలో భద్రతాపరమైన పనులు జరుగుతుండటంతో కొన్ని రైళ్లను అధికారులు రద్దు చేశారు. మరికొన్ని రైళ్లను దారి మళ్లించి తిప్పుతున్నారు. రద్దయినవాటిలో డబుల్ డెక్కర్ రైలు కూడా ఉంది. అక్టోబరు 29వ తేదీ వరకు రాజమండ్రి-విశాఖపట్నం మధ్య నడిచే ప్యాసింజర్ రైలు (07466)ను పూర్తిగా రద్దు చేశారు. అలాగే తిరుగు ప్రయాణంలో విశాఖపట్నం-రాజమండ్రి (07467) రైలు కూడా రద్దైంది.
విశాఖపట్నం-విజయవాడ-విశాఖపట్నం మధ్య ఉదయ్ ఎక్స్ ప్రెస్ పేరుతో నడిచే డబుల్ డెక్కర్ (నెం. 22701) రైలును ఈరోజు వరకు రద్దుచేశారు. రెండువైపులా అందుబాటులో ఉండదు. అలాగే పాక్షికంగా కొన్ని రైళ్లు రద్దయ్యాయి. విశాఖపట్నం-కిరండూల్ నైట్ ఎక్స్ ప్రెస్ కొరాపుట్ నుంచి తిరిగి ప్రయాణమవుతుంది. హౌరా-జగదల్ పూర్ సామలేశ్వరి ఎక్స్ ప్రెస్ టిట్లాగడ్ నుంచి హౌరాకు తిరుగు ప్రయాణమవుతుంది. భువనేశ్వర్-జగదల్ పూర్ హిరాఖండ్ ఎక్స్ ప్రెస్ కొరాపుట్ నుంచి తిరుగు ప్రయాణమై భువనేశ్వర్ చేరుతుందని రైల్వే వర్గాలు వెల్లడించాయి.

ఒడిసా రాష్ట్రంలోని బాలసోర్ వద్ద కోరమాండల్ ఎక్స్ ప్రెస్ దారుణ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. సిగ్నలింగ్ వ్యవస్థలో లోపం వల్ల ఈ ప్రమాదం తలెత్తినట్లు అధికారులు గుర్తించారు. దీంతో దేశవ్యాప్తంగా అన్ని జోన్లు, డివిజన్లలో సిగ్నలింగ్ ను ఆధునికీకరిస్తున్నారు. ఈ పనుల్లో భాగంగా కొన్ని రైళ్లను రద్దుచేయడం, మరికొన్ని రైళ్లను దారి మార్చి తిప్పడం వంటివి చేస్తున్నారు. అసౌకర్యమైనప్పటికీ దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రయాణికులు రైల్వేకు సహకరించాలని అధికారులు కోరుతున్నారు.












Click it and Unblock the Notifications