ప్రధాన్ రాజీనామా, జోషికి బాధ్యతల వెనుక భారీ వ్యూహం- అసలు లెక్క మొదలు..!!
కాక్రోచ్ పార్టీ.. విద్యార్ధుల ఆందోళన ఫలించింది. విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసారు. ప్రహ్లాద్ జోషీకి విద్యా శాఖ బాధ్యతలు కేటాయించారు. ధర్మేంద్ర ప్రధాన్ నిర్ణయం ద్వారా కాక్రోచ్ పార్టీ విజయం.. మోదీ వెనుకడుగుగా పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. అయితే.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నిర్ణయం వేళ మోదీ టీంలో పెద్ద ఎత్తున తర్జన భర్జన జరిగింది. పరిస్థితిని పూర్తి గా అధ్యయనం చేస్తూనే... తదుపరి అడుగులకు వీలుగా రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ ముఖ్యుల సమాచారం. దీని వెనుక భారీ వ్యూహం ఉందని చెబుతున్నారు.
నీట్ పేపర్ పత్రాల లీక్.. తదనంతర పరిణామాలతో కాక్రోచ్ పార్టీ పెద్ద ఎత్తున నిరసనకు దిగింది. ఛలో పార్లమెంట్ సమయంలో చోటు చేసుకున్న ఘటనలతో ఈ వ్యవహారం కొత్త టర్న్ తీసుకుంది. విద్యార్ధులకు కాంగ్రెస్ మద్దతుగా నిలిచింది. ప్రభుత్వం పైన ఒత్తిడి పెరిగింది. నిరసనలు పొరుగు రాష్ట్రాలకు వ్యాపించాయి. ఢిల్లీలో ఉద్రిక్తత ఏర్పడింది. అటు పార్లమెంట్ సమావేశాలు స్తంభించి పోయాయి. కాక్రోచ్ పార్టీతో చర్చల సమయంలో ప్రధాన డిమాండ్లకు కేంద్రం అంగీకరించింది. కానీ, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకూ పోరాటం కొనసాగుతుందని కాక్రోచ్ పార్టీ తేల్చి చెప్పింది. దీంతో.. ప్రధాని మోదీ ముఖ్యులతో వరుస సమావేశాలు నిర్వహించారు. భవిష్యత్ ప్రణాళికలను ఖరారు చేసారు. ఆ తరువాత పక్కా వ్యూహంలో భాగంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసారు.

పార్లమెంట్ సమావేశాల వేళ వ్యూహాత్మకంగా
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోతే.. నిరసనలు.. ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయని కేంద్రానికి నివేదికలు అందాయి. దీంతో, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తరువాత ప్రహ్లాద్ జోషీకి విద్యాశాఖ అప్పగించాలనే నిర్ణయం వెనుక ఆసక్తికర అంశాలు ఉన్నాయి. అయితే, రాజకీయంగానూ చర్చించారు. పార్లమెంట్ సమావేశాల్లో ఈ సారి కేంద్రం మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్, వందేమాతరం వంటి కీలక బిల్లులను ప్రవేశ పెట్టాలని నిర్ణయించింది. వీటి ఆమోదం కోసం సంఖ్యా పరంగానూ సిద్దం అవుతోంది. ఈ సమయం లో ధర్మేంద్ర ప్రధాన్ కోసం విపక్షాలకు.. నిరసన కారులకు అవకాశం ఇవ్వటం కంటే.. ఒక అడుగు వెనక్కు వేసి ఈ బిల్లులను ఆమోదం పొందేలా చూస్తే.. భవిష్యత్ లో పూర్తి పట్టు చిక్కుతుందనే నిర్ణయానికి వచ్చారు. మంత్రిని కొనసాగించటం కంటే రాజకీయంగా దీర్ఘకాలిక వ్యూహాలను సక్సెస్ చేయటమే ముఖ్యమనే నిర్ణయానికి వచ్చారు. దీంతో.. ఈ సమావేశాల కేంద్రంగానే మోదీ ప్రభుత్వం సరి కొత్త వ్యూహాలతో మత నిర్ణయాల అమలుకు సమాయత్తం అవుతోంది.












Click it and Unblock the Notifications