మారిపోనున్న తిరుమల ప్రధాన కాంప్లెక్స్ రూపురేఖలు
ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సోమవారం నాడు 80,502 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 31,890 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.88 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 25 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 నుంచి 22 గంటల సమయం పట్టింది. క్యూ లైన్లు, కంపార్ట్మెంట్లల్లో వేచి ఉన్న భక్తులకు టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అన్నప్రసాదాలు, పాలు, మంచినీరు, అల్పాహారాన్ని పంపిణీ చేశారు.

స్వామివారికి తలనీలాలను సమర్పించే భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోన్న నేపథ్యంలో.. తిరుమలలోని కల్యాణకట్ట కాంప్లెక్స్ ను ఆధునికీకరించాలని టీటీడీ నిర్ణయించింది. దీనికి అవసరమైన చర్యలు తీసుకుంటోంది. దీనికి అవసరమైన మార్గదర్శకాల రూపకల్పనపై కసరత్తు చేస్తోంది. త్వరలోనే రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ జారీ చేయనుంది.
భక్తులకు ప్రస్తుతం ఎదురవుతున్న అసౌకర్యాన్ని నివారించడానికి కల్యాణకట్ట కాంప్లెక్స్ ను ఆధునికీకరించాలని ఇటీవలే టీటీడీ పాలక మండలి సమావేశంలో నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ ప్రతిపాదనకు సూత్రప్రాయంగా బోర్డు ఆమోదం తెలిపింది. దీనివల్ల కాంప్లెక్స్ లో పరిశుభ్రత, రద్దీ నియంత్రణ, భద్రతా ప్రమాణాలను మెరుగుపడటంతో పాటు తలనీలాల సమర్పణలో ఆచార వ్యవహారాలు, అక్కడి పవిత్రతకు భంగం వాటిల్లదని టీటీడీ అభిప్రాయపడుతోంది.
రద్దీ, అసౌకర్య పరిస్థితులపై టీటీడీకి పదేపదే ఫిర్యాదులు అందుతోన్న విషయం తెలిసిందే. ఈ ఏడాది జూలై నాటికి తిరుమలలో 9,13,650 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. గత ఏడాది ఇదే నెలలో ఈ సంఖ్య 8,67,242గా ఉంది. ఈ ఏడాది కాలంలో తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్యలో 46,418 పెరుగుదల కనిపించింది.
ఇది- కల్యాణకట్టను ఆధునీకరించాల్సిన అవసరాన్ని స్పష్టం చేసినట్టవుతోందని టీటీడీ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ కాంప్లెక్స్ ను ఆధునికీకరించాలని టీటీడీ నిర్ణయించింది. ఈ క్రమంలో డిజైన్ కన్సల్టెంట్లను ఎంపానెల్ చేయడానికి చర్యలు చేపట్టింది. పవిత్రతను కాపాడుకుంటూనే పరిశుభ్రత, వెంటిలేషన్, లైటింగ్, భద్రతను మరింత మెరుగుపరచడానికి టీటీడీ ప్రాధాన్యత ఇవ్వనుంది.












Click it and Unblock the Notifications