గోల్కొండ కోట కింద మరో అద్భుతం!.. 500 ఏళ్ల రహస్యం వీడేనా?
హైదరాబాద్లోని ప్రముఖ చారిత్రక నేపథ్యం కలిగిన గోల్కొండ కోట వెలుపలి ప్రాకారంలో ఓ రహస్య సొరంగం బయటపడిందన్న వార్త తీవ్ర ఉత్సాహాన్ని, సంచలనాన్ని రేకెత్తించింది. ఈ వార్త వెంటనే సోషల్ మీడియాలో వ్యాపించడంతో స్థానిక ప్రజలు, పర్యాటక ప్రేమికులు ఈ సొరంగాన్ని వీక్షించేందుకు గురువారం సాయంత్రం, శుక్రవారం ఉదయాల్లో కోట వద్దకు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
గోల్కొండలోని '18 సీడీ' (అథర సీడీ) ప్రాంతంలో ఉన్న 400 ఏళ్ల పురాతన కుతూబ్ షాహీ స్మశానవాటిక, క్రీడా మైదానం వద్ద భారత సైన్యానికి చెందిన అధికారులు అక్రమంగా తవ్వకాలు జరిపినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ తవ్వకాలం క్రమంలోనే ఓ సొరంగం వెలుగుచూసినట్లు కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ వెల్లడించారు. ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ఆదేశాల మేరకు ఈ సొరంగం బయటపడిన విషయం గురించి గురువారం రాత్రి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సూపరింటెండెంట్ దృష్టికి తీసుకువెళ్లినట్లు ఆయన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.

వివాదస్పద భూమి నేపథ్యం
సొరంగం బయటపడిన 18 సీడీ లేదా అథర సీడీ ప్రాంతం చాలా కాలంగా వివాదాస్పదంగా ఉంది. ఆర్మీ అధికారులు ఆ స్థలాన్ని తమ ఆస్తిగా పేర్కొంటుండగా.. స్థానిక నివాసితులు దాన్ని స్మశానవాటికగా ఉపయోగిస్తూ ఖననాలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా కాలా చబుత్ర నుంచి అథర సీడీ వరకు ఉన్న బహిరంగ ప్రాంగణాన్ని స్థానిక యువకులు క్రికెట్, గిల్లీ-దండా వంటి ఆటలు ఆడుకోవడానికి వినియోగిస్తుంటారు.
రహస్య మార్గాలు, చారిత్రక వదంతులు
కాకతీయులు, కుతుబ్ షాహీల పాలన సాగిన గోల్కొండ కోట బహుళ అంతస్తుల నిర్మాణ ప్రాభవం కలిగి ఉంది. ఈ కోట నుంచి చార్మినార్, గోషామహల్, చౌమహల్లా ప్యాలెస్, నౌబత్ పహాడ్ వంటి నగరంలో కీలక ప్రాంతాలకు భూగర్భ రహస్య మార్గాలు, సొరంగాలు ఉన్నాయని శతాబ్ధాలుగా ప్రచారం జరుగుతోంది. వీటిలో కొన్నింటిలో రాజధనాలు, నిధులు దాచబడి ఉన్నాయని, మరికొన్ని అత్యవసర వేళల్లో తప్పించుకునే రహస్య మార్గాలు అని భావిస్తున్నారు. అయితే ఇప్పటివరకు జరిపిన పరిశోధనల్లో బయటపడిన సొరంగాలన్నీ చిన్న మార్గాలుగానో లేదా కొద్దిభాగం భూమిలో పూడిపోయిన పాత రాజభవనాల అవశేషాలుగానో నిర్ధారణ అయ్యాయి. ఈ తవ్వకాలపై, బయటపడిన సొరంగం నిర్ధారణపై స్పష్టత కోసం భార సైనిక అధికారులు స్పందించాల్సి ఉంది.













Click it and Unblock the Notifications