బుక్కయ్యారంటూ.. అంతలో ఒంటరై!: పవన్-జగన్లపై బాబు ప్లాన్ రివర్స్, ఢిల్లీలో చక్రం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు వ్యూహం బెడిసికొట్టిందా? 2019లో బీజేపీతో లేదా జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో వెళ్లాలన్న ఆయన ఆశలు నీరుగారిపోయాయా? అంటే అవుననే అంటున్నారు.
మోడీ 'తమిళ' ఆట, ఎన్డీయే నుంచి ఔట్! బట్టలూడదీసి కొడతారు.. పవన్పై మూకుమ్మడి దాడి
ప్రత్యేక హోదా అంశం ఇప్పుడు బీజేపీ, టీడీపీ మధ్య దూరం పెంచింది. సుజనా చౌదరి, అశోక్ గజపతి రాజులు కేంద్రమంత్రి పదవులకు రాజీనామా చేయడం మొదలు పవన్ గుంటూరు సభ వరకు నివురుగప్పిన నిప్పులా ఉన్న ఆగ్రహం ఆ తర్వాత మాటల యుద్ధానికి దారి తీసింది.
అడ్డంగా బుక్కయ్యారంటూ పదేపదే
ఏపీ సీఎం చంద్రబాబును నిలదీసేందుకు ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పదేపదే ఓటుకు నోటు అంశాన్ని తెర పైకి తీసుకువస్తోంది. చంద్రబాబు హోదా అంశాన్ని కేంద్రానికి తాకట్టు పెట్టారని, ఓటుకు నోటు కేసుతో పాటు ఏపీలో జరుగుతున్న భారీ అవినీతి నేపథ్యంలోనే ఆయన ఢిల్లీకి భయపడుతున్నారని పదేపదే విమర్శలు చేస్తోంది. ఓటుకు నోటులో అడ్డంగా దొరికిపోయాడంటూ లెక్కలేనన్నిసార్లు విమర్శించింది.
2019లో ఇలా భావిస్తే
వైసీపీని టీడీపీ ఎప్పుడూ పట్టించుకున్నట్లుగా కనిపించలేదు. ఓ దశలో వైసీపీ కంటే జనసేనానిని ప్రతిపక్షంగా పేర్కొన్న సందర్భాలు ఉన్నాయి. పవన్ తీరు కూడా టీడీపీకి అనుకూలంగా కనిపించింది. బీజేపీ హోదా ఇవ్వకుంటే టీడీపీ, జనసేన కలిసి వెళ్తాయనే అభిప్రాయం చాలామందిలో ఏర్పడింది. ఎందుకంటే తనకు పదవులపై ధ్యాస లేదని పవన్ పదేపదే చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది చివరికల్లో బీజేపీకి గుడ్బై చెప్పి టిడిపి, జనసేనలు కలిసి ముందుకు సాగుతాయని భావించారు.
అంతా రివర్స్
కానీ ఏపీకి హోదా అంశం మరోసారి ఊపందుకోవడం, టీడీపీ ఎంపీలు కేంద్ర కేబినెట్ పదవులకు రాజీనామా చేయడం, హఠాత్తుగా పవన్ కళ్యాణ్ టీడీపీపై ఊహించని విధంగా విమర్శలు చేయడంతో అంతా రివర్స్ అయింది. పవన్ కళ్యాణ్ వెనుక బీజేపీ ఉందని, జగన్తో కలిసి ముందుకు సాగాలని కమలం పార్టీ భావిస్తోందని, అందుకే తమను టార్గెట్ చేసుకున్నారని చంద్రబాబు సహా టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శించే స్థాయికి చేరుకుంది.
బీజేపీ పట్ల ఆగ్రహం
2014లో టీడీపీ, బీజేపీ, జనసేనలు కలిసినా వైసీపీ కంటే కేవలం ఐదు లక్షల ఓట్లు మాత్రమే ఎక్కువ వచ్చాయి. చంద్రబాబు అనుభవం, మోడీ, పవన్ మద్దతుతో టీడీపీ గెలిచిందని వైసీపీ పదేపదే విమర్శించింది. అయితే చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి ఏర్పడిందని, అలాగే హోదా విషయంలో బీజేపీ పట్ల ప్రజలు ఆగ్రహంతో ఉన్న నేపథ్యంలో జనసేన, టీడీపీ కలిసి వెళ్తాయని భావించారు.
ఇబ్బందుల నేపథ్యంలో 2019కి బాబు ప్లాన్
అందుకు పలు కారణాలు కూడా ఉన్నాయనే వాదనలు ఉన్నాయి. కాపు రిజర్వేషన్ల హామీ నేపథ్యంలో.. ఇస్తే ఓ రకంగా, ఇవ్వకుంటే మరోరకంగా టీడీపీ ఇబ్బందుల్లో పడేలా ఉందని, పాలనపై ప్రజల్లో కొంత అసంతృప్తి ఉందని, ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్తో కలిసి వేళ్తే దానిని పూడ్చుకోవచ్చని టీడీపీ భావించిందని అంటారు. అందుకు పవన్ గతంలో విమర్శించినా టీడీపీ సంయమనం పాటించడం, ఓపిగ్గా ఉండాలని చంద్రబాబు ఆదేశించడమే అందుకు నిదర్శనం అంటున్నారు.
బీజేపీని ఢిల్లీలో దెబ్బకొడతారా?
ఏపీకి బీజేపీ ప్రత్యేక హోదా బదులు ఇచ్చిన ప్యాకేజీ ఇచ్చినా ఆ పార్టీతో ఉండాలనేది చంద్రబాబు ఉద్దేశ్యమని, లేదంటే బీజేపీని వీడి పవన్తో వెళ్లాలని భావించారని, కానీ ఇప్పుడు ఆ రెండూ రివర్స్ అయ్యాయని అంటున్నారు. నిన్నటి వరకు ఎవరితోనైనా ముందుకు సాగాలనుకున్నప్పటికీ ఇప్పుడు అనూహ్యంగా రాష్ట్రంలో ఒంటరి అయ్యారని అంటున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీని దెబ్బతీసేందుకు జాతీయస్థాయిలో థర్డ్ ఫ్రంట్ పేరుతో చంద్రబాబు చక్రం తిప్పినా ఆశ్చర్యం లేదంటున్నారు. ఇప్పటికే మమతా బెనర్జీ, శివసేన, కేజ్రీవాల్, అకాలీదళ్లతో పాటు నితీష్ కుమార్ కలిసినా ఆశ్చర్యం లేదంటున్నారు. ఇప్పటికే ఆయనకు మమత, ములాయం తదితరులు ఫోన్లు చేశారు.