ఏపీ, తెలంగాణలో మోత మోగుతున్న పేరు.. మెహర్ రమేష్
రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం భోళాశంకర్ చిత్ర దర్శకుడు మెహర్ రమేష్ పేరు మార్మోగిపోతోంది. వాస్తవానికి ఏదైనా విజయం సాధించిన సందర్భంలోనో, అవార్డు గెలుచుకున్నప్పుడో, దేశానికి క్రీడల్లో ఏదైనా పతకం తెచ్చిన సందర్భాల్లో ఆయా విజేతలపేర్లు దేశవ్యాప్తంగా మర్మోగిపోతుండేవి. ప్రస్తుతం మెహర్ పేరు కూడా ఏపీ, తెలంగాణలో అలాగే మోత మోగుతోంది. విజయం సాధించినందుకు కాదు సుమా.. చెత్త సినిమా తీసినందుకు.
చిరంజీవి అభిమానులు కూడా ఈ సినిమా అనౌన్స్ అయినప్పటికీ ఎవరూ ఆశలు పెట్టుకోలేదు. మెహర్ రమేష్ తో సినిమా వద్దని చిరంజీవికి అభిమానులు నెత్తీనోరు బాదుకొని చెప్పారు. అయినా తన సొంత మనిషి, బంధువు, తన వ్యవహారాలు చక్కదిద్దేవాడు కావడంతో మంచి కెరీర్ ఇద్దామన్న చిరు ఆలోచన మంచిదేకానీ దాన్ని మెహర్ సద్వినియోగంచేసుకోలేకపోయాడు.

సినిమా విడుదలైనప్పటికీ ఇప్పటివరకు ఫేస్ బుక్, ట్విటర్, వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్, టెలిగ్రామ్, లింక్డ్ ఇన్... ఇలా ఒకటేంటి.. సోషల్ మీడియాలన్నింటిలో మెహర్ రమేష్ పేరు విపరీతమైన ట్రోలింగ్ కు గురవుతోంది. కంత్రి, బిల్లా, శక్తి, షాడో లాంటి సినిమాలు ఇచ్చిన తర్వాత 10 సంవత్సరాలు ఖాళీ వచ్చింది. ఈ 10 సంవత్సరాల్లో ఏం నేర్చుకున్నావన్నా.. రీమేక్ కూడా తీయడం రాదా? అంటూ కామెంట్లు పెడుతున్నారు.
శక్తి సినిమా కోసం అవసరం లేకపోయినా నిర్మాతతో భారీగా ఖర్చుపెట్టించాడనే ముద్ర పడింది. పోనీ ఆ విజువల్స్ గ్రాండ్ గా ఉంటాయా? అంటే అలా కూడా ఉండవు. కంత్రి సినిమాలో పోకిరి, మున్నా, బన్నీ సినిమాల పోలికలుంటాయి. బిల్లా అనేది అజిత్ బిల్లాకు రీమేక్. శక్తి సినిమాలో మగధీర పోలికలుంటాయి. షాడో విషయానికొస్తే లంకేశ్వరుడు సినిమానే తిప్పి తిప్పి తీసిన భావన కలుగుతుంది. హీరోలుకానీ, నిర్మాతలుకానీ ఎవరూ అతనితో సినిమాను తీయడానికి ముందుకు రాలేదు. వేదాళం సినిమాను అలాగే తీసినా యావరేజ్ గా అయినా నిలిచేదంటున్నారు. కానీ చిరంజీవి, మెహర్ కలిసి చేయడంవల్ల వేదాళం కంటే పాత సినిమాలా అనిపించిందంటున్నారు. ఎందుకన్నా మామీద ఇలా పగబట్టావు? అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.












Click it and Unblock the Notifications