'హైదరాబాద్'పై కేసీఆర్ ధిక్కారం: కేంద్రం సీరియస్?
న్యూఢిల్లీ: గవర్నర్గిరి వద్దని, మీ ఉత్తర్వులు అమలు చేయమని కేంద్రానికి తేల్చి చెప్పిన తెలంగాణ ప్రభుత్వం పైన కేంద్రం సీరియస్గా ఉందట. ఈ ధిక్కారంపై ఎటువంటి చర్యలు తీసుకోవాలని తర్జనభర్జనలు పడుతోందా!? అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయని వార్తలు వస్తున్నాయి.
ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్లో శాంతి భద్రతలను గవర్నర్కు అప్పగించే విషయం ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోనే ఉందని, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని అంశాలను ఉల్లంఘించడమంటే రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనని కేంద్రం భావిస్తోంది.
తెలంగాణ ప్రభుత్వ ధిక్కారంపై కేంద్రం సీరియస్గా ఉందని, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనవసరంగా కొరివితో తలగోక్కుంటున్నారని హోంశాఖ అధికారులు చెబుతున్నారట. ఉల్లంఘన విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న విషయమై కేంద్రం తర్జన భర్జనలు పడుతోందని, ఇప్పటికే ఒకటి రెండుసార్లు చెప్పిన మీదట చట్ట ఉల్లంఘనను గుర్తు చేస్తూ కేంద్రం హెచ్చరికను జారీ చేసే అవకాశం ఉందట.

గతంలో పోలవరం ప్రాజెక్టు విషయంలో ప్రధాన మంత్రి నిండు సభలో ఆమోదించినప్పుడు వ్యతిరేకించలేకపోయిన కేసీఆర్ ఆ బిల్లును ఏ విధంగా అడ్డుకోలేకపోయారో.. ఇప్పుడు ఉమ్మడి రాజధాని ప్రాంతంలో గవర్నర్ అధికారాలను కూడా ఎంతగా వ్యతిరేకించినా అడ్డుకోలేరని ఈ విషయంలో ఉన్నత న్యాయస్థానం కూడా జోక్యం చేసుకునే అవకాశం తలెత్తదని రాజ్యాంగ, న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
అపాయింటెడ్ డే నుంచీ ఉమ్మడి రాజధానిలో ప్రజల జీవితాలు, స్వేచ్ఛ, ఆస్తుల భద్రత విషయంలో పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 8లో గవర్నర్కు ప్రత్యేక అధికారాలను కట్టబెట్టారని గుర్తు చేస్తున్నారు. అంతేనా.. గవర్నర్ బాధ్యతలకు సంబంధించి ఏదైనా వివాదం తలెత్తితే ఆయన నిర్ణయమే అంతిమం అవుతుందని, గవర్నర్ ఏ నిర్ణయం తీసుకున్నా దాని ఔచిత్యాన్ని ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదని పునర్వ్యవస్థీకరణ చట్టంలోనే పేర్కొన్నారని వివరిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే, శాంతి భద్రతల విషయంలో గవర్నర్కు ఎలాంటి అధికారాలు ఉండవని, రాజ్యాంగంలోని 163వ అధికరణ కింద మంత్రి మండలి సలహా ప్రకారమే గవర్నర్ నడుచుకోవాల్సి వస్తుందని తెలంగాణ ప్రభుత్వం పదే పదే చేస్తున్న వాదనలు పునర్వ్యవస్థీకరణ చట్టానికి వ్యతిరేకమేనని, ప్రభుత్వ వైఖరి రాజ్యాంగం, పార్లమెంట్, రాష్ట్రపతిని ధిక్కరించినట్లే భావించాలని రాజ్యాంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
గవర్నర్కు ఎలాంటి ప్రత్యేక అధికారాలు లేవని వాదిస్తూ శనివారం కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర హోం శాఖకు లేఖ రాసిన విషయాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు. ఉమ్మడి రాజధానిలో గవర్నర్కు అధికారాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని తెలంగాణ సర్కార్ను కోరుతూ కేంద్రం ఇప్పటికే రెండుసార్లు లేఖలు రాసిందని వివరిస్తున్నారు.
గవర్నర్కు ప్రత్యేకాధికారాలను కల్పించే విషయంలో బిజినెస్ ట్రాన్సాక్షన్ నిబంధనలను మార్చుకోవాలని గత నెల తొలి వారంలో లేఖ రాసిన కేంద్రం.. తాజాగా గవర్నర్కు విశేషాధికారాల అమలుకు తెలంగాణ సర్కార్ కట్టుబడి ఉండాలని చెబుతూ 13 అంశాలతో కూడిన మరో లేఖను సంధించిన విషయం తెలిసిందే. ఈ రెండు లేఖలకూ జవాబుగా.. గవర్నర్కు అధికారాలు కల్పించడం కుదరదని తెలంగాణ సర్కార్ స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications