కేసీఆర్! బాబుతోనే చెప్పిస్తాం, ఎలా అడ్డుకుంటారో చూస్తాం: ఎర్రబెల్లి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మాయమాటలకు తమ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతోనే సమాధానం చెప్పిస్తామని తెలంగాణ టీడీపీ శాసన సభా పక్ష నేత ఎర్రబెల్లి దయాకర రావు శనివారం అన్నారు.
కేసీఆర్, ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు తమ అవినీతి, అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకే చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటామని అంటున్నారన్నారు. తెలంగాణకు ఏపీ సర్కార్ అన్యాయం తలపెడితే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే కేంద్రానికి ఫిర్యాదు చేయాలని, తామూ మద్దతిస్తామన్నారు.
ఎన్నికల ముందు కల్లబొల్లి కబుర్లు చెప్పి అధికారం చేపట్టిన తెరాస ఒక్క హామీనీ నెరవేర్చలేదన్నారు. పైగా, వరంగల్ జిల్లాలో చంద్రబాబు పర్యటిస్తే అడ్డుకుంటామని మాట్లాడుతున్నారన్నారు. తెరాస మోసం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు భరోసా కల్పించేందుకే జాతీయపార్టీ అధ్యక్షుడుగా చంద్రబాబు వస్తున్నారన్నారు.

నాగార్జున సాగర్ నీటిపై తెలంగాణ ఆరోపణలు నిజమైతే కేంద్రానికి లేదా ప్రధానికి ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. తెలంగాణను అభివృద్ధి చేసిన చంద్రబాబు వరంగల్లో పర్యటిస్తే తెరాస నేతలు ఎలా అడ్డుకుంటారో తామూ చూస్తామన్నారు. అడ్డుకుంటే ఉరికిస్తామని పాలకుర్తి సంఘటనను గుర్తు చేశారు.
ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అండదండలు అందించి ఆదుకునేందుకు యువనేత నారా లోకేష్ తెలంగాణ జిలాల్లో పర్యటిస్తే తప్పేంటని ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనాల కోసం నిజాంపై ప్రశంసలు కురిపిస్తూ మన పాలన ముసుగులో కేసీఆర్ దొరల పాలన సాగిస్తున్నారన్నారు.
కేసీఆర్ పాలనలో ఉన్న ఆంక్షలు, నిర్బంధాలు, దౌరజ్న్యాలు, రాజకీయ వేధింపుల కారణంగా ప్రజలకు మరో పోరాటం తప్పేలా లేదన్నారు. పచ్చి అవకాశవాదంతో ఊసరవెల్లిలా విద్యార్థి సంఘాలు, పార్టీలు మారిన ఆంజనేయ గౌడ్కు చంద్రబాబును, లోకేష్ను విమర్శించే హక్కు లేదని తెలుగునాడు విద్యార్థి సమాఖ్య ఉపాధ్యక్షులు అన్నారు.












Click it and Unblock the Notifications