పిచ్చి పట్టింది: ఎపి మంత్రులపై శ్రీనివాస గౌడ్ ఫైర్
తమ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు పాలన చూసి ఎంపి మంత్రులు నేర్చుకోవాల్సింది చాలా ఉందని ఆయన అన్నారు. ఎపి మంత్రుల తీరు చూస్తుంటే గురువింద గింజ నలుపెరుగదన్నట్లుగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఎంపి మంత్రులు నోరు అదుపులో పెట్టుకోవాలని ఆయన అన్నారు. ఎపి మంత్రులకు పిచ్చిపట్టినట్లుగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు.
ఆంధ్రప్రదేశ్ మంత్రులు తమ బతుకులు తమను బతకనీయాలని ఆయన అన్నారు. ఈ నెల 19వ తేదీనన తమ ప్రభుత్వం నిర్వహిస్తున్న సర్వేపై ప్రజలు సంతోషంగా ఉన్నారని, సీమాంధ్ర నాయకులే భయపడుతున్నారని ఆయన అన్నారు. వాస్తవాలను సర్వే ద్వారా తెలుసుకుందామని అనుకుంటున్నామని ఆయన చెప్పారు.
కుటుంబ సర్వేపై కెసిఆర్ మంచి నిర్ణయం తీసుకున్నారని ఆయన చెప్పారు. హైదరాబాదులో భూములు ఆక్రమించుకున్నవారు, అక్రమాస్తులు కూడబెట్టుకున్నవారు సర్వేకు భయపడుతున్నారని ఆయన అన్నారు. తెలంగాణలో ఆంధ్రవాళ్లు మాత్రమే కాదు, దేశంలోని అన్ని ప్రాంతాలవాళ్లూ ఉన్నారని, ఇతర ప్రాంతాల వాళ్లకు లేని భయం ఆంధ్రావాళ్లకే ఎందుకని ఆయన అన్నారు. ఇతర ప్రాంతాలవాళ్లు తమ నాయకులను, ప్రభుత్వాన్ని విమర్శించడం లేదని అన్నారు. తమ నాయకులను, ప్రభుత్వాన్ని విమర్శిస్తే జరిగే పరిణామాలకు వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు.
తెలంగాణలో పనిచేస్తున్న ఆంధ్ర అధికారులు సర్వే నిర్వహణలో పాల్గొనాల్సిందేనని ఆయన అన్నారు. తమ ప్రభుత్వం నుంచి జీతం తీసుకునే ఉద్యోగులంతా సర్వేలో పాల్గొనాలని ఆయన అన్నారు. అలా పాల్గొనని ఉద్యోగుల జాబితాను తయారు చేస్తామని, ప్రభుత్వాన్ని ధిక్కరించినవారు ఏ విధంగా ప్రయోజనం పొందారో తేలుస్తామని ఆయన అన్నారు. ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించేవారిపై చర్యలుంటాయని ఆయన అన్నారు.