తప్పకపోవచ్చు: కెసిఆర్ వ్యూహంపై టి కాంగ్రెస్ ఆందోళన
హైదరాబాద్: ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ ప్రధాని అవుతారనుకుంటే మొదటగా మద్దతిచ్చేది తామేనని చెప్పిన తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు వ్యాఖ్యల వెనుక మర్మమేమిటని తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు తర్జన భర్జన పడుతున్నారట.
కేంద్రంలో రాహుల్ ప్రధాని కావడానికి మద్దతునిచ్చి తెలంగాణలో తాను ఏర్పాటు చేయబోయే ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతునివ్వాలని అంటారేమోనన్న అనుమానాలు వారిలో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర విభజన నిర్ణయాన్ని కేంద్రం ప్రకటించిన తర్వాత తెరాసను కాంగ్రెస్లో విలీనం చేయడానికి గానీ, కనీసం తమతో పొత్తు పెట్టుకోవడానికి గానీ నిరాకరించిన కెసిఆర్ ఇప్పుడు మాట మార్చడంలోని ఆంతర్యం ఏమిటనే దానిపై టి కాంగ్రెసు నేతల్లో చర్చ జరుగుతోంది.
ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత రాహుల్ ప్రధాని కావడానికి సహకరిస్తామని చెప్పడం వెనుక ఆయనకు వ్యూహం ఉందని భావిస్తున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మ్యాజిక్ ఫిగర్ తామూ చేరుకోలేకపోతే మజ్లిస్ పార్టీ మద్దతు తీసుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. ఇందులో భాగంగానే మజ్లిస్ పార్టీ అధ్యక్షులు అసదుద్దీన్ ఒవైసీతో నగరంలోని హోటల్లో పొన్నాల లక్ష్మయ్య తదితర నాయకులు మంతనాలు జరిపి ఒప్పించారు.

దీనిని గమనించిన కెసిఆర్ తన పావులు కదిపి ఉంటారని అంటున్నారు. కేంద్రంలో యూపిఏ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉంటే, తెరాస అవసరం ఏర్పడితే... కేంద్రంలో రాహుల్ ప్రధాని కావడానికి సహకరిస్తామంటే, రాష్ట్రంలోనూ ప్రభుత్వ ఏర్పాటులోనూ కాంగ్రెస్ - టిఆర్ఎస్లు కలిసి పని చేయాల్సి వస్తుంది.
టిఆర్ఎస్కు మ్యాజిక్ ఫిగర్ రాకుంటే రాష్ట్రంలో తాను ఏర్పాటు చేయబోయే ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని కెసిఆర్ తమ పార్టీ అధిష్ఠానానికి షరతు పెడతారేమోనన్న అనుమానం తెలంగాణ కాంగ్రెసు నేతలను వెంటాడుతోంది.
కేంద్రంలో రాహుల్ ప్రధాని అయ్యేందుకు టిఆర్ఎస్ సహకారాన్ని తమ పార్టీ అధిష్ఠానం తీసుకున్నట్లయితే, తెలంగాణలో ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సహకరించాల్సిందిగా అధిష్ఠానం ఆదేశిస్తే చేయగలిగిందేమీ ఉండదని వారు మదనపడుతున్నారు. తమ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మంత్రివర్గంలో చేరేందుకు కెసిఆర్ ఆఫర్ ఇస్తారు తప్పితే.. తమకు మాత్రం ఆయన మద్దతివ్వరని వారు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications