మోడీతో చేరం, మూడో కూటమితో పోతాం: కెసిఆర్
కరీంనగర్: తాము బిజెపి నేతృత్వంలోని ఎన్డియెలో చేరే ప్రసక్తి లేదని, తమ పార్టీ నూటికి నూరు శాతం సెక్యులర్ పార్టీ అని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తాము మతతత్వ పార్టీలతో చేతులు కలపబోమని, ఎన్డీయే కూటమిలో చేరబోమని ఆయన స్పష్టం చేశారు. ఎన్డీయేకు 200 సీట్లు కూడా రావని అన్నారు. ఆ కూటమి అధికారంలోకి వస్తుందని కల్పిస్తున్న భ్రమలు వట్టివేనని అన్నారు.
తమ పార్టీ తృతీయ కూటమిలో భాగస్వామి అవుతుందని, కూటమి నేతలతో మాట్లాడుతున్నానని అన్నారు. నామినేషన్ల ఘట్టం ముగిసిన తరువాత తొలిసారి ఆదివారం కరీంనగర్లో ఆయన శంఖారావం సభ నిర్వహించారు. ప్రాంతీయ పార్టీల కూటమే అధికారం దక్కించుకుంటుందని రాజకీయ విశ్లేషకులు కూడా చెబుతున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం బాగుపడాలంటే సెక్యులర్గానే ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు.

తెలంగాణకు ఆంధ్రా పార్టీలు అవసరమా అని అడిగారు. పునర్నిర్మాణంలో పాలు పంచుకోవడానికే తమ పార్టీ అధికారం కోరుతున్నదని చెప్పారు. కత్తి ఒకరి చేతికి ఇచ్చి యుద్ధం ఒకరిని చేయమంటే కుదరదని, ఈ ఎన్నికల్లో తమ పార్టీయే గెలవాలని, అసెంబ్లీకి, లోక్సభకు రెండు ఓట్లు తమ పార్టీకి వేసి తమ అభ్యర్థులందరిని గెలిపించాలని అన్నారు.
తెలంగాణ ప్రభుత్వంలో అమరుల కుటుంబాలను గుండెల్లో పెట్టుకుంటామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో తెరాసను విలీనం చేయొద్దని తెలంగాణ సమాజమే కోరినట్టు తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత గోదావరి, కృష్ణా జలాలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవడానికి ప్రాజెక్టులు నిర్మిస్తామని చెప్పారు.
అధికారంలోకి వచ్చిన మూడేళ్ల కల్లా 24 గంటల పాటు కరెంట్ ఇచ్చే స్థాయికి చేరుకుంటామని, ఆ బాధ్యత తనదని హామీ ఇచ్చారు. తెలంగాణలోని కాంగ్రెస్ వాళ్లు ఎన్నడూ నాయకులు కాదని, వారు కేవలం సబార్డినేట్లని, రాజశేఖర్ రెడ్డి పాపాలతో పాలు పంచుకున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications