జైత్రయాత్ర: కాంగ్రెస్ తీరే కెసిఆర్ మార్పుకు కారణమా?
హైదరాబాద్: కాంగ్రెసు పార్టీతో విలీనం, పొత్తు అంటూ ఇప్పుడు ఏమీ పెట్టుకోవద్దని తెలంగాణ రాష్ట్ర సమితి యోచిస్తోంది. ఇప్పటికే విలీనం అంశానికి ఆ పార్టీ దాదాపు తెరదించిందని చెప్పవచ్చు. కాంగ్రెసుతో పొత్తుకు కూడా తెరాస సిద్ధపడటం లేదట. 2014 ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని భావిస్తోంది. విలీనం జరిగినా, పొత్తు పెట్టుకున్నా కాంగ్రెసు పార్టీ తమకు భారంగా మారుతుందని తెరాస భావిస్తోందట.
తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో గులాబీ దళం ఆలోచనలు క్రమక్రమంగా మారుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ షరతుల్లేని తెలంగాణ ఇస్తే, పార్టీని విలీనం చేస్తానంటూ తెరాస అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు గతంలో పలుమార్లు చెప్పారు. అదే సమయంలో పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఆమోదం పొందేవరకు విలీనం ప్రస్తావన అసందర్భమనే ఆలోచనతో ఆయన ఉన్నారు. అయితే ఇప్పుడు మాత్రం తెరాస కాంగ్రెసుతో దోస్తీకి ససేమీరా అంటోంది.
ఇటీవల వెలువడ్డ సర్వే ఫలితాలు తమకు పూర్తి అనుకూలంగా ఉండటం, తెలంగాణ ఇచ్చినా కాంగ్రెస్ ప్ర యోజనం పొందలేదని స్పష్టం కావటం, ధరల పెరుగుదలకు తోడు, బొగ్గు మసితో కేంద్రంలోని యూపిఏ సర్కా రు ప్రతిష్ట మసకబారటం, టి కాంగ్రెస్ నాయకత్వంలో సమష్టితత్వం లేకపోవటం వెరసి తెరాస అధిష్ఠానం ఆలోచనలో మార్పు కనిపిస్తోందంటున్నారు.
వాస్తవానికి కాంగ్రెస్కు ఉద్దేశపూర్వకంగానే ఈ ఝలక్ ఇచ్చినప్పటికీ, నిజామాబాద్ జిల్లా బోధన్లో ఈ నెల 18న టి కాంగ్రెస్ నిర్వహించిన జైత్రయాత్ర సభ పేలవంగా సాగిందనే భావన వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్లో తాము విలీనమైనా లేక ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నా, అందులోని ముఖ్య నేతలను కూడా గెలిపించే బాధ్యతను తామే తీసుకోవాల్సి వస్తుందని తెరాస భావిస్తోందట.
మరోవైపు కాంగ్రెస్లో విలీనమైతే, ఇక్కడ మరో పార్టీకి చోటు ఇచ్చినట్టు అవుతుందని అనుమానిస్తున్నారు. ఎలాగూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సమైక్యాంధ్ర వైఖరితో సీమాంధ్రకు పరిమితం అయిన దరిమిలా, తెలంగాణలో ఏర్పడే వెలితిని టిడిపి సొమ్ము చేసుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఒకవేళ 2014 ఎన్నికల్లోపు తెలంగాణ ఏర్పడకపోయినా, యూపిఏ తిరిగి అధికారంలోకి రాకపోయినా అప్పటి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవచ్చని, దానివల్ల అవకాశం తమ చేతుల్లో ఉంటుందనే భావనతో తెరాస ఉందంటున్నారు. హైదరాబాదు పైన ఏమైనా మెలిక పెట్టినా కాంగ్రెసుతో కలవకుంటేనే ఎదుర్కోవచ్చునని భావిస్తున్నారు.